KKR vs MI Ipl 2024: చిన్న టార్గెట్ ఛేదించలేక చేతులెత్తేసిన ముంబై - కోల్కతాను గెలిపించిన బౌలర్లు
04 May 2024, 6:00 IST
KKR vs MI Ipl 2024: ఐపీఎల్ 2024లో ముంబై పరాజయాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం 170 పరుగుల చిన్న టార్గెట్ను ఛేజ్ చేయలేక కోల్కతా చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్
KKR vs MI Ipl 2024: ఈ ఐపీఎల్లో బ్యాటర్లదే హవా నడుస్తోంది. 250 స్కోర్లను కూడా ఈజీగా ఛేజ్ చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. కానీ ముంబై మాత్రం సింపుల్ టార్గెట్ను ఛేదించలేక చేతులెత్తేసింది. కోల్కతా చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైంది. శుక్రవారం ముంబై ఇండియన్స్పై కోల్కతా 24 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. కోల్కతా బౌలర్లను ధాటికి ముంబై 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. సూర్యకుమార్ మినహా మిగిలిన బ్యాట్స్మెన్స్ దారుణంగా విఫలమయ్యారు.
రెండో ఓవర్ నుంచే...
170 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఈజీగా ఛేజ్ చేస్తుందని అభిమానులు భావించారు. అందుకు తగ్గట్టుగానే ఇషాన్ కిషన్ ఫస్ట్ ఓవర్లోనే ఓ సిక్సర్ కొట్టి దూకుడు మీద కనిపించాడు. కానీ రెండో ఓవర్ నుంచే ముంబై పతనం మొదలైంది. స్టార్క్ బౌలింగ్లో బౌల్డయ్యాడు ఇషాన్. ఆ తర్వాత ఫామ్లో ఉన్న రోహిత్ (11 రన్స్)తో పాటు నమన్ ధీర్(11 రన్స్) కూడా నిరాశపరిచాడు.
ఆదుకున్న సూర్యకుమార్...
61 రన్స్కే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబైని సూర్యకుమార్ ఆదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతోన్న సూర్యకుమార్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. కానీ అతడికి మిగిలిన బ్యాట్స్మెన్స్ నుంచి సరైన సహకారం అందలేదు. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్య సింగిల్ డిజిట్కే ఔటై నిరాశపరిచారు.
టిమ్ డేవిడ్తో కలిసి ముంబైని గెలిపించేందుకు సూర్యకుమార్ ప్రయత్నించాడు. ధాటిగా ఆడుతోన్న సూర్యకుమార్ను తెలివిగా రసెల్ బోల్తా కొట్టించాడు. 35 బాల్స్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో సూర్యకుమార్ 56 పరుగులు చేశాడు. సూర్యకుమార్ ఔటైన వెంటనే టిమ్ డేవిడ్ కూడా పెవిలియన్ చేరడంతో ముంబై ఓటమి ఖాయమైంది.
స్టార్క్ నాలుగు వికెట్లు...
కోల్కతా బౌలర్లలో నాలుగు వికెట్లతో మిచెల్ స్టార్క్ చెలరేగాడు. కోల్కతా గెలుపులో కీలక భూమిక పోషించాడు. రసెల్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 19.5 ఓవర్లలో 169 రన్స్ చేసింది. వెంకటేష్ అయ్యర్ 52 బాల్స్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 రన్స్, మనీష్ పాండే, 31 బాల్స్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 42 ఆదుకోవడంతో ఈ మాత్రమైనా స్కోరు చేసింది. వీరిద్దరు మినహా సింగిల్ డిజిట్కే ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా, తుషార తలో మూడు వికెట్లు తీసుకున్నారు.
రెండో స్థానంలో కోల్కతా...
ముంబైపై గెలుపుతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో కోల్కతా నైట్రైడర్స్ రెండో స్థానానికి చేరుకుంది. పదిమ్యాచుల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లను కోల్కతా సాధించింది. పాయింట్స్ టేబుల్లో రాజస్థాన్ టాప్లో నిలవగా, లక్నో మూడో స్థానంలో కొనసాగుతోంది. సన్రైజర్స్ నాలుగు, చెన్నై ఐదో స్థానాల్లో ఉన్నాయి.
ఆర్సీబీ లాస్ట్
పదిమ్యాచుల్లో మూడు విజయాలతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో చివరి ప్లేస్లో కొనసాగుతోంది. ముంబై తొమ్మిదో స్థానంలో నిలవగా...గుజరాత్ ఎనిమిది, పంజాబ్ ఏడో స్థానంలో ఉన్నాయి. పదకొండు మ్యాచుల్లో ఐదు విజయాలతో ఢిల్లీ ఆరో స్థానాన్ని దక్కించుకున్నది.