Babar Azam: మళ్లీ పాకిస్థాన్ కెప్టెన్గా బాబర్ ఆజమ్.. అధికారికంగా ప్రకటించిన పీసీబీ.. షాహిన్ అఫ్రిదిపై వేటు
31 March 2024, 14:47 IST
- Babar Azam - Pakistan Cricket: పాకిస్థాన్ టీమ్కు బాబర్ ఆజమ్ మళ్లీ కెప్టెన్ అయ్యాడు. అతడిని వన్డే, టీ20 ఫార్మాట్లకు మరోసారి కెప్టెన్గా నియమించింది పీసీబీ. ఈ విషయంపై నేడు అధికారిక ప్రకటన చేసింది.
Babar Azam: మళ్లీ పాకిస్థాన్ కెప్టెన్గా బాబర్ ఆజమ్.. అధికారికంగా ప్రకటించిన పీసీబీ.. షాహిన్ అఫ్రిదిపై వేటు
Babar Azam: పాకిస్థాన్ క్రికెట్లో అనూహ్య పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. 2024 టీ20 ప్రపంచకప్ ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ను మళ్లీ కెప్టెన్గా నియమించింది పీసీబీ. వన్డే, టీ20 జట్లకు సారథిగా అతడిని నేడు (మార్చి 31) అధికారికంగా ప్రకటించింది. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తీసేసిన ఆజమ్కు నెలల వ్యవధిలోనే మళ్లీ ఆ బాధ్యతలను అప్పగించింది.
గతేడాది ఇండియా వేదిగా జరిగిన వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేసింది. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. పాక్ క్రికెట్లో కొన్ని వివాదాలు కూడా తలెత్తాయి. దీంతో కెప్టెన్సీ నుంచి ఆజమ్ను పీసీబీ తొలగించింది. టెస్టులకు షాన్ మసూద్ను కెప్టెన్ను చేసింది. టీ20లకు పేసర్ షాహిన్ అఫ్రిదికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. వన్డేలకు రెగ్యులర్ కెప్టెన్ను నియమించలేదు. అయితే, ఇది జరిగిన సుమారు ఆరు నెలలకే ఇప్పుడు మరోసారి పరిమిత ఓవర్ల ఫార్మాట్ (వన్డే, టీ20లు) జట్ల కెప్టెన్సీ బాధ్యతలను బాబర్ ఆజమ్కు ఇచ్చింది పీసీబీ.
టీ20 ప్రపంచకప్కు ముందు..
బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక.. షాహిన్ అఫ్రిది సారథ్యంలో న్యూజిలాండ్పై పాకిస్థాన్ ఓ ఐదు టీ20ల సిరీస్ ఆడింది. ఈ సిరీస్లో 1-4 తేడాతో పాక్ ఘోరంగా ఓడింది. షాహిన్ అఫ్రిది కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. పీఎస్ఎల్లో అతడి సారథ్యంలోని లహోర్ ఖలందర్స్ కూడా పేలవ ప్రదర్శన చేసింది. దీంతో ఇక మళ్లీ బాబర్ ఆజమ్కే పరిమిత ఓవర్ల ఫార్మాట్ల కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చేందుకు పీసీబీ డిసైడ్ అయింది.
ఈ ఏడాది 2024 టీ20 ప్రపంచకప్ జూన్లో వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగనుంది. ఈ మెగాటోర్నీకి రెండు నెలల ముందు మళ్లీ బాబర్ ఆజమ్ను కెప్టెన్ను చేసింది పీసీబీ. ప్రపంచకప్కు బాబరే బెస్ట్ అని ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా టీ20 కెప్టెన్గా ఉన్న షాహిన్ అఫ్రిదిపై వేటు వేసింది. అయితే, టెస్టులకు షాన్ మసూద్ ప్రస్తుతం కెప్టెన్గా కొనసాగనున్నాడు.
ఆజమ్ను మళ్లీ కెప్టెన్ చేయాలని సెలెక్షన్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు పీసీబీ వెల్లడించింది. “పీసీబీ సెలెక్షన్ కమిటీ నుంచి వచ్చిన ఏకగ్రీవ ప్రతిపాదనలను అనుసరించి.. పాకిస్థాన్ పురుషుల క్రికెట్ టీమ్ వైట్ బాల్ కెప్టెన్గా బాబర్ ఆజమ్ను చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నియమించారు” అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నేడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం పీసీబీ సెలెక్షన్ కమిటీలో వాహబ్ రియాజ్, అసద్ షఫీక్, అబ్దుల్ రజాక్, మహమ్మద్ యూసుఫ్ ఉన్నారు.
పాకిస్థాన్ తర్వాతి సిరీస్
టీ20 ప్రపంచకప్ కంటే ముందు పాకిస్థాన్ రెండు టీ20 సిరీస్లు ఆడనుంది. స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్లో పాక్ జట్టుకు బాబర్ సారథ్యం వహించనున్నాడు. అలాగే, ఇంగ్లండ్లో ఆ జట్టుతో మరో టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్లో బరిలోకి దిగనుంది.
2024 టీ20 ప్రపంచకప్లో తన తొలి మ్యాచ్లో జూన్ 6న అమెరికాతో టెక్సాస్ వేదికగా మ్యాచ్ ఆడనుంది పాకిస్థాన్. అందరూ ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 9వ తేదీన న్యూయార్క్ వేదికగా జరగనుంది.
టాపిక్