Tirupati Accident : బెంజ్ కారు ఢీ కొట్టి అడ్డంగా రెండు ముక్కలైన ట్రాక్టర్
27 September 2022, 17:27 IST
- Tractor and Mercedes Benz Accident : తిరుపతి సమీపంలో బైపాస్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఒకరికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో బెంజ్ కారు ఢీ కొట్టిన ట్రాక్టర్ రెండు ముక్కలైంది.
ట్రాక్టర్ విడిభాగం
రేణిగుంట-చిత్తూరు బైపాస్పై రోడ్డు ప్రమాదం జరిగింది. కేఏ 04 ఎంయు 3456 నంబర్ గల బెంజ్ కారు తిరుపతి ( Tirupati) నుంచి చిత్తూరు వైపు వెళ్తోంది. అదే సమయంలో బైపాస్పై రాంగ్ రూట్లో ఓ ట్రాక్టర్ వచ్చింది. యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. సరిగా అదే టైమ్ లో ట్రాక్టర్(Tractor)ను బెంజ్ కారు వేగంగా ఢీ కొట్టింది. కారుకు ఎడమ వైపు భాగం కొంత దెబ్బతింది. వాహనంలోని వారికి ఎలాంటి గాయాలు అవలేదు.
బెంజ్ కారు(Benz Car) ఢీ కొట్టిన వేగానికి ట్రాక్టర్ మాత్రం అడ్డంగా రెండు ముక్కలైంది. ఇంజిన్ భాగం మొత్తం రెండుగా విడిపోయింది. ట్రాలీ నుంచి విడిపోయి బోల్తా కొట్టింది. ట్రాక్టర్ ఇంజిన్ మొత్తం నాశనమైంది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ట్రాక్టర్(Tractor) ముందు భాగం ఒకవైపు, డ్రైవర్ కూర్చునే వెనుకభాగం మరో వైపు పడిపోయాయి. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్కు గాయాలు అయ్యాయి.
బెంజ్ కారుకు మాత్రం ముందు భాగమే కాస్త ధ్వంసమైంది. బెంజ్ కారు ఢీ కొట్టిన వేగానికి ట్రాక్టర్ వంటి భారీ వాహనం సైతం ముక్కలు కావడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన జరిగే సమయంలో కారు వేగం 100 నుంచి 120 కిలోమీటర్ల వేగం ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెల్లాచెదురుగా పడిన ట్రాక్టర్ విడి భాగాలను పక్కకు తొలగించి.. ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేశారు.