తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sabarimala Trains : అయ్యప్ప భక్తులకు శుభవార్త.. నంద్యాల మీదుగా 4 ప్రత్యేక రైళ్లు

Sabarimala Trains : అయ్యప్ప భక్తులకు శుభవార్త.. నంద్యాల మీదుగా 4 ప్రత్యేక రైళ్లు

Published Oct 29, 2024 12:48 PM IST

google News
    • Sabarimala Trains : తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శబరిమల వెళ్తారు. కానీ.. సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. సరైన రవాణా సౌకర్యం కల్పించాలనే డిమాండ్ ఉంది. తాజాగా రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది.
నంద్యాల మీదుగా 4 ప్రత్యేక రైళ్లు

నంద్యాల మీదుగా 4 ప్రత్యేక రైళ్లు

నంద్యాల జిల్లాలో దీక్ష చేస్తున్న అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ శుభవార్త అందించిందని.. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వ్యాఖ్యానించారు. నంద్యాల ప్రాంతం నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప దీక్షా భక్తుల సౌకర్యార్థం.. నంద్యాల మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లను నడపాలని.. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరినట్లు ఎంపీ వివరించారు. నవంబర్ మొదటి వారం నుంచి నంద్యాల మీదుగా శబరిమలకు నాలుగు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.


భారత్ గౌరవ్ సేవలు..

మరోవైపు భారత్ గౌరవ్ పేరుతో శబరిమలకు రైల్వే శాఖ ప్రత్యేక రైలును నడుపుతోంది. మొత్తం 4 రాత్రులు, 5 పగళ్ల ప్యాకేజీతో ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైలు నవంబర్ 16న సికింద్రాబాద్‌లో బయలుదేరి పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, గూడూరు మీదుగా శబరిమల అయ్యప్ప చోట్టనిక్కర దేవి ఆలయానికి చేరుతుంది. 20వ తేదీన తిరుగు ప్రయాణం అవుతుంది.

బీమాతో కలిపి..

ఈ రైలులో టీ, టిఫిన్, భోజనం, ఏపీ, నాన్ ఏసీ, ప్రయాణికులకు బీమాతో కలిపి.. టికెట్ ధర ఒక్కొక్కరికి స్లీపర్ క్లాసులో రూ.11,475, థర్డ్ ఏసీలో రూ.18,790, సెకెండ్ ఏసీలో రూ.24,215 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు 82879 32312, 92814 95848 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని రైల్వే అధికారులు వివరించారు. అయ్యప్ప భక్తులు ఈ సర్వీసును వినియోగించుకోవాలని సూచించారు.

రద్దీకి అనుగుణంగా..

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. గతంలోనూ శబరిమలకు పలు ప్రత్యేక రైళ్లను నడిపారు. ముఖ్యంగా మకర జ్యోతి దర్శనం సమయంలో శబరిమలకు ఎక్కువ మంది వెళ్తుంటారు. వారి కోసం నవంబర్ నెల ఎండింగ్ నుంచి డిసెంబర్, జనవరి నెలలో స్పెషల్ ట్రైన్లను నడిపే అవకాశం ఉంది.

సరైన ప్లానింగ్ ఉండాలి..

శబరిమల మకరజ్యోతి సమయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు తమ దర్శనాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే శబరిమల మకరజ్యోతి ఘట్టం 2-3 నిమిషాల పాటు నిర్వహించే కార్యక్రమం. శబరిమల కొండపై శబరిమల మకరజ్యోతి దర్శనం రోజున యాత్రికుల ఆలయ నిర్వాహకులు మూడుసార్లు మాత్రమే దీపాలు వెలిగిస్తారు. ఆ సమయంలో మాత్రమే జ్యోతి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.