Vinayaka Chavithi Special : కోరికలు ఈ వినాయకుడి చెవిలో చెబితే.. వింటాడంట
30 August 2022, 20:45 IST
- History Of Bikkavolu Ganapathi Temple : కోర్కెలను మనసులు అనుకుని దేవుడికి మెుక్కుతారు. కానీ నేరుగా మాత్రం ఎవరూ చెప్పరు. మనసులో అనుకుంటే వింటాడనే నమ్మకం. అయితే ఓ ఆలయంలో మాత్రం నేరుగా దేవుడికే భక్తులు కోరికలు చెప్తారు. ఆ ఆలయం ఎక్కడో కాదు.. మన ఏపీలోనే ఉంది.
బొజ్జ గణపయ్య
Bikkavolu Ganapathi Temple History : వినాయక చవితి వేడుక మెుదలైంది. భక్తులంతా బొజ్జ గణపయ్యను స్మరిస్తూ ఉంటారు. తమ విఘ్నాలను తొలగించమని వేడుకుంటారు. తమ మనసులో కోరికలను నెరవేర్చాలని అడుగుతారు. అయితే ఓ ఆలయంలో మాత్రం నేరుగా దేవుడి చెవిలోనే కోరికలు చెప్పొచ్చు. ఆయన విని.. కోరికలను నెరవేరుస్తాడని.. అక్కడ భక్తుల నమ్మకం.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయమంటే భక్తులకు ఎంతో ఇష్టం. కోర్కెలు చెవిలో చెబితే చాలు నెరవేరుస్తున్నాడని నమ్ముతుంటారు. ఏకశిల మూర్తిగా బొజ్జ గణపయ్య దర్శనమిస్తారు. వినాయక చవితి ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఇక్కడ స్వామివారి విగ్రహం.. 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుగా ఉంది. తొండం కుడివైపు తిరిగి ఉంటుంది. స్వయంభు వెలసిన లంబోధరుడు భక్తుల కోరికలు తీరుస్తుంటాడని నమ్ముతుంటారు.
ఈ విగ్రహం తూర్పు చాళుక్యుల కాలం నాటిది. ఆయన మహిమలు తెలిసి క్రీస్తుశకం 840లో చాళుక్యులు ఆలయాన్ని నిర్మించారని, శాసనాలు చెబుతున్నారు. ఈ దేవాలయం మెుదట భూమిలోకి కూరుకుపోయి ఉండేదని స్థానికంగా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 19వ శతాబ్దంలో ఓ రోజు స్వామివారు నేరుగా భక్తుడి కలలోకి వచ్చి తాను ఉన్న చోటును చెప్పాడట. అతడు విషయాన్ని అందరికి చెప్పాడు. దీంతో గ్రామస్తులంతా కలిసి విగ్రహాన్ని బయటకు తీశారు.
ఈ దేవాలయానికి వచ్చే భక్తులు తమ కోర్కెలను స్వామి వారి చెవిలో చెప్పుకొంటారు. ఆ తర్వాత ముడుపులు చెల్లించుకుంటారు. ఇలా చేస్తే.. నెరవేరని తమ కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్ముతుంటారు. ఇక్కడ ఉన్న నంది, భూలింగేశ్వర స్వామిని దర్శనం చేస్తే.. అన్ని పాపాలు పోతాయని చెబుతుంటారు. అయితే బిక్కవోలులో తూర్పు చాళుక్యులు నిర్మించిన అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. రాజ రాజేశ్వరీ దేవాలయం, చంద్రశేఖర స్వామి దేవాలయం ఉన్నాయి.
గణపతి ఉత్సవాల సమయంలో సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవాలు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమం నిర్వహిస్తే.. ఇంటిలో ఎలాంటి అశుభాలు ఉండవని అంటుంటారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి.. స్వామి వారి చెవిలో తమ కోర్కెలు చెబుతూ ఉంటారు.
బిక్కవోలులోని గణపతి దేవాలయాన్ని సందర్శించాలంటే.. రాజమండ్రికి రావాలి. అక్కడ నుంచి బిక్కవోలు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా కాకినాడకు 31 కిలోమీటర్ల దూరంలో ఉంది.