తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఆంధ్ర ప్రదేశ్ రంగస్థలం.. పాత్రదారులే వేరు.. అదే కథ.. అదే స్క్రీన్‌ప్లే

ఆంధ్ర ప్రదేశ్ రంగస్థలం.. పాత్రదారులే వేరు.. అదే కథ.. అదే స్క్రీన్‌ప్లే

HT Telugu Desk HT Telugu

03 October 2023, 12:16 IST

    • ‘ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ నాటకాల్లో పాత్రలే మారుతున్నాయి తప్ప అదే రంగస్థలం... అదే కథ నడుస్తున్నది. నిజానికి ఇలాంటి రాజకీయాలు మనకు కొత్తేమీ కాదు. మహాభారత కాలం నుండీ ఉన్నాయి!’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్ ఐవీ మురళీకృష్ణ శర్మ రాజకీయ విశ్లేషణ.
చంద్రబాబు అరెస్టుతో తెరపైకి భువనేశ్వరి, బ్రాహ్మణి
చంద్రబాబు అరెస్టుతో తెరపైకి భువనేశ్వరి, బ్రాహ్మణి (Mohammed Aleemuddin)

చంద్రబాబు అరెస్టుతో తెరపైకి భువనేశ్వరి, బ్రాహ్మణి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు తర్వాత ఇదంతా ‘జగన్నా’టకమని తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కానీ తెలుగునాట ఇది కొత్తేమీ కాదు. గత దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఈ విధంగానే సాగుతున్నాయి. ఈ రాజకీయ నాటకాల్లో పాత్రలే మారుతున్నాయి తప్ప అదే రంగస్థలం... అదే కథ నడుస్తున్నది. నిజానికి ఇలాంటి రాజకీయాలు మనకు కొత్తేమీ కాదు. మహాభారత కాలం నుండీ ఉన్నాయి! పాండవులు రాజ్యం కోసం పోరాడారు. ఆపదలో ఉన్న పాండవుల కోసం వారి కుమారులు ఉప పాండవులు కురుక్షేత్రంలో అడుగుపెట్టి తమ శౌర్యాన్ని చాటారు. అమరేంద్ర బాహుబలి కోసం మహేంద్ర బాహుబలి పోరాడాడు.

ట్రెండింగ్ వార్తలు

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

పురాణాలు, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ... రక్త సంబంధీకుల కోసం పోరాడే ఇలాంటి పాత్రలను మనుషులు సహజంగానే ఇష్టపడుతారు. వారినే ఆదరిస్తారు... గెలిపిస్తారు! ఇక మన తెలుగు రాజకీయాల సమరాలను పరిశీలిస్తే గతంలో జగన్మోహన్‌రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జరిగినట్టే ఇప్పుడు నారా చంద్రబాబు, లోకేశ్‌ విషయంలోనూ జరగబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసులలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కూడా సీఐడీ నోటీసులు ఇచ్చింది. లోకేశ్‌ని కూడా జైలుకు పంపించి... నాయకత్వ లేమీతో టీడీపీ శ్రేణులను నిరాశకు గురిచేయాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. నాయకుడు జైల్లో ఉంటే ఏమవుతుంది? గతంలో జగన్‌ జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో... ఇప్పుడూ అదే జరుగుతుంది. అప్పుడు దివంగత నేత రాజశేఖర్‌ రెడ్డి సతీమణి విజయమ్మ పాత్రను ఇప్పుడు చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి, కూతురు షర్మిల పాత్రను ఆయన కోడలు బ్రాహ్మణి పోషిస్తున్నారు. ఈ రాజకీయాలలో మారేది పాత్రలే తప్ప కథ, స్క్రీన్‌ప్లే కాదు. చట్ట సభల్లో 33 శాతం మహిళల రిజర్వేషన్‌ అమలుకు ఇంకా సమయం పట్టవచ్చేమోగానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దశాబ్దకాలంగా మహిళలే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

దివంగత నేత వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం సీనియర్‌ నేత రోశయ్యను, అనంతరం కిరణ్‌కుమార్‌ రెడ్డిని సీఎంగా చేయడంతో జగన్మోహన్‌రెడ్డి పార్టీ హైకమాండ్‌కు ఎదురుతిరిగారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కుర్చీ దక్కదనే అంచనాతో 2010 నవంబర్‌ 29న ఎంపీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీని బలోపేతం చేయడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్న క్రమంలో అక్రమంగా ఆస్తులు కూడగట్టారనే అభియోగంతో 2012 మే 27న జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జగన్‌ చంచల్‌గూడ జైలులో ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జైల్లో ఉన్నారు కాబట్టి పార్టీ చచ్చిపోతుందని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం భావించింది. కానీ అందుకు భిన్నంగా ఈ చర్యలే వైఎస్‌ఆర్‌సీపీ పునాదులు బలపడడానికి కారణాలయ్యాయి. జగన్మోహన్‌రెడ్డి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల రాజకీయ రంగప్రవేశానికి తలుపులు తెరుచుకున్నాయి.

తెలుగు ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి బతికున్నంతకాలం విజయమ్మ, షర్మిల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జగన్‌ జైలుకు వెళ్లడంతో తొలిసారి విశాఖపట్నం విమానాశ్రయంలో దిగి చేయి ఊపినప్పుడు, షర్మిల అచ్చం తండ్రిలాగే ఉందని ప్రజల నుంచి జేజేలు అందుకున్నారు. అక్కడి నుంచే అనుకోకుండా ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. తల్లి విజయమ్మతో కలిసి 2012 జూన్‌లో జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం షర్మిల ప్రచారం చేశారు.

అంతకుముందు క్రైస్తవమత ప్రచార సభలలో ప్రసంగించిన అనుభవంతో అన్న జగన్మోహన్‌ రెడ్డి స్థానంలో ఉండి అన్ని తానై పార్టీని ముందుకు నడిపించారు. ఫలితంగా 2012లో 18 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 15 చోట్ల వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ సందర్భంగా 2012 జూన్‌ 15వ తేదీన జైల్లో జగన్‌ని కలిసిన తర్వాత ‘ఈ గెలుపు దేవుడి తీర్పు’ అని విజయమ్మ అంటే, ‘2014లో మా అన్నే ముఖ్యమంత్రి’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

జగన్‌కి బెయిల్‌ దొరకకపోవడంతో షర్మిలా పార్టీ బాధ్యతలన్నింటినీ తన భుజాన వేసుకున్నారు. తనకు తాను ‘జగనన్న వదిలిన బాణం’ అని ప్రకటించుకున్న ఆమె 3 వేల కిలోమీటర్ల భారీ పాదయాత్ర చేసి కష్టకాలంలో వైఎస్సార్సీపీని ఒడ్డున పడేశారు. 16 జిల్లాల్లో చేపట్టిన ఈ పాదయాత్రలో కోటిమందికి పైగా జనాలను షర్మిల ప్రత్యక్ష్యంగా కలిసినట్లు అంచనా. 2013 సెప్టెంబర్‌లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జగన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసే వరకూ షర్మిల పార్టీ కార్యక్రమాల్ని నిరాటంకంగా నడిపించారు. మరోవైపు విజయమ్మ అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజల మనుసులను చూరగొనడనంతోపాటు పార్టీని బతికించారు, నిలబెట్టారు. విజయమ్మ సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా క్రియాశీల పాత్ర పోషించారు. వైఎస్సార్సీపీని తమ శక్తియుక్తులతో మండే అగ్నిగోళంలా తయారు చేసిన ఘనత ఈ తల్లీ కూతుళ్లకే దక్కుతుంది. ఆ తర్వాత జగన్‌ ప్రతిపక్ష నేత కావడం, ముఖ్యమంత్రి కావడంలో వీరిద్దరి పాత్ర వెలకట్టలేనిది.

గతంలో జగన్‌ జైలు పాలయినప్పుడు తల్లీ కూతుళ్లు పార్టీ పటిష్టతకు కష్టపడితే, మరోవైపు జగన్‌ సతీమణి వైఎస్‌.భారతీ న్యాయ పోరాటంలో ఆయనకు బాసటగా నిలిచారు. జగన్‌ జైలు పాలయినప్పుడు కొణతాల రామకృష్ణ, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శోభనాగిరెడ్డి, మైసూరారెడ్డి, సోమయాజులు, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి సీనియర్‌ నేతలు పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేశారు.

ఇప్పుడు చంద్రబాబు అరెస్టు కావడంతో టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న యనమల రామకృష్ణ, అశోక్‌ గజపతిరాజు, బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, రామ్మోహన్‌నాయుడు, బాలకృష్ణ వంటి సీనియర్‌ నేతలు పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటు చేసి పార్టీలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారు. వీటికి అదనంగా నందమూరి కుటుంబం ఒక్కటై చంద్రబాబు పక్షాన నిలబడింది. అంతేకాక, టీడీపీ-జనసేన కూటమి తరఫున ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఉమ్మడిగా కార్యక్రమాలు చేపడుతామని ఉభయ పార్టీల నేతలు చెప్పారు.

గతంలో జగన్‌పై అక్రమంగా కేసులు నమోదు చేశారంటూ మద్దతు ప్రకటించిన వామపక్షాలు ఇప్పుడు కూడా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీకి బాసటగా ఉంటున్నారు. వీరికి పలు ప్రజాసంఘాలు కూడా తోడవుతున్నాయి. గతంలో జగన్‌పై కేసుల సందర్భంగా సీబీఐ సంస్థను కేంద్ర ప్రభుత్వం చేతిలో పంజరం అనే ఆరోపణలొస్తే, ఇప్పుడు చంద్రబాబు అరెస్టు తర్వాత సీఐడీని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పంజరం అంటూ అవే రకమైన విమర్శలు వెలువడుతున్నాయంటే అప్పటి నాటకం మళ్లీ ఇప్పుడు తిరిగి ప్రారంభమైందని చెప్పవచ్చు. గతంలో జగన్‌పై కేసులు నమోదు చేశాక అప్పడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నామరూపాల్లేకుండా పోయింది. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జగన్‌పై తుపాకీ పెట్టి చంద్రబాబును దెబ్బతీయాలని చూస్తోంది. ఇప్పటికే ఏపీలో నోటాతో పోటీ పడుతున్నా బీజేపీకి భవిష్యత్తులో భంగపాటు తప్పదని ప్రజాస్వామ్యవాదులు వ్యాఖ్యానిస్తున్నారు.

2014కి ముందు వైఎస్‌.విజయమ్మ, షర్మిలా ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ఆ పాత్రలనే పోషిస్తున్నారు. కూలిపోతుందనుకున్న వైఎస్‌ఆర్‌సీపీని విజయమ్మ, షర్మిలా ఏ విధంగా తమ భుజాలకెత్తుకున్నారో, ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్న టీడీపీని నిలబెట్టడానికి భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా రంగంలోకి దిగారు. అంతేకాక ఈ నలుగురి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ సతీమణిగా విజయమ్మకు ఆనాడు ఏ పలుకుబడి ఉందో, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కూతురిగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్యగా భువనేశ్వరికీ అంతే ఆకర్షణ శక్తి ఉంది. ఒక ముఖ్యమంత్రి బిడ్డగా షర్మిలాకు ఎలాంటి ఆదరణ లభించిందో, ఒక ముఖ్యమంత్రి మనవరాలిగా, మరో ముఖ్యమంత్రి కోడలిగా, సినీ నటుడి కుమార్తెగా బ్రాహ్మణికి కూడా అదే స్థాయి ఆకర్షణ ఉంది. వీరికి ఉన్న మరో సారుప్యత ఏమిటంటే వీరెవరికీ అంతకుముందు రాజకీయ అనుభవం లేకపోవడం, తమ అధినేతలు జైలుకు వెళ్లడంతో అనివార్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించడం!

బ్రాహ్మణి రాజకీయ ప్రవేశం ఖాయం

యువ వ్యాపారవేత్తగా విజయవంతంగా రాణిస్తున్న నారా బ్రాహ్మణి త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్‌ పూర్తి చేసిన నారా బ్రాహ్మణి, హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేస్తూ ఆ సంస్థను ఉన్నత స్థానానికి తీసుకెళ్లడంలో కృషి చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత కష్టాల్లో ఉన్న పార్టీ బాధ్యతను కూడా ఆమె తన భుజాన వేసుకునేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌ అయిన దగ్గర నుంచి భర్త లోకేష్‌కు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ‘నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు’ వంటి బాణాల్లాంటి మాటల్ని సంధిస్తూనే, చంద్రబాబుకి మద్దతుగా ‘కాగడాలు వెలిగిద్దాం, మోతమోగిద్దాం’ లాంటి వినూత్న నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆక్టోబర్‌ 2వ తేదీన ‘సత్యమేవ జయతే’ పేరుతో నిరాహార దీక్షలను భువనేశ్వరి, బ్రాహ్మణి ఆధ్వర్యంలో తెలుగుదేశం పెద్దఎత్తున చేపట్టింది. ఇలాంటి నిరసనలనే గతంలో విజయమ్మ కూడా చేపట్టారు.

యువగళం పాదయాత్రతో లోకేశ్‌ నాయకుడిగా తనను తాను నిరూపించుకుంటున్న తరుణంలో, పాదయాత్ర మధ్యలో ఆగిపోవడం టీడీపీకి నష్టమే! ధీర్ఘకాలంలో పాదయాత్ర ఎలాంటి ప్రభావం చూపిస్తుందో గతంలో పాదయాత్ర చేసిన జగన్‌కి బాగా తెలుసు. అందుకే లోకేశ్‌ పాదయాత్రను తిరిగి ప్రారంభించకుండా కేసులతో ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ లోకేశ్‌ అరెస్టయితే నారా బ్రాహ్మణి వెంటనే ప్రజల్లోకి వచ్చేందుకు సిద్దపడుతున్నారు. బ్రాహ్మణి కూడా షర్మిల వలే పాదయాత్ర చేపట్టి, యువగళం రెండో దశని పూర్తి చేస్తే... అది తప్పకుండా టీడీపీకి సానుకూలంగా మారుతుంది.

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి... రాజమండ్రిలోనే ఉంటూ పార్టీ నేతలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక విధంగా తన నిరసన తెలియజేస్తూ ప్రజలను తనవైపు తిప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడి అరెస్టుతో ఆగిపోయిన బస్సు యాత్రను ‘మేలుకో తెలుగోడా’ పేరుతో భువనేశ్వరి యాత్ర చేపట్టనున్నారు. నాలుగున్నర ఏండ్ల వైఎస్‌ఆర్‌సీపీ సర్కారు వైఫల్యాలను, అక్రమ కేసులతో వేధిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగట్టడమే లక్ష్యంగా ఆమె ఈ యాత్ర చేపడుతున్నారు.

పై పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే 2012 మే 27వ తేదీ నుండి 2013 సెప్టెంబర్‌ 23 వరకు దాదాపు 16 నెలలు ఇదే తెలుగు నాట రంగస్థలంపై నాడు జగన్‌ కోసం విజయమ్మ, షర్మిలా పోషించిన పాత్రనే 2023 సెప్టెంబర్‌ 9వ తేదీన చంద్రబాబు అరెస్టు తర్వాత భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా పోషిస్తున్నారు. ప్రస్తుతం జనసేనాని పవన్‌ కూడా టీడీపీకి అండగా నిలబడడంతో ఈ రంగస్థలం రక్తికట్టడం ఖాయం. ఈ కథలోనూ ఆంధ్ర ప్రజలు ఎప్పటిలాగే బాధితులే గెలవాలని కోరుకుంటున్నారు. నేతలు దోషులుగా తేలేవరకూ ప్రజలు వారిని బాధితులుగానే భావిస్తారు.

అక్రమంగా కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం సందర్భాల్లో ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు బాధితుల తరఫున నిలబడి పోరాటాలు చేయడం మంచి పరిణామం. అయితే ఇదే సమయంలో ఒకప్పుడు బాధితులు అనంతరం అధికారం చేపట్టాక అదే తరహా కక్షసాధింపు చర్యలు చేపట్టడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండాలంటే ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు పోరాడుతున్న సమయంలోనే ఆయా పార్టీలు తిరిగి ఇలాంటి చర్యలు చేపట్టబోమని హామీ ఇవ్వాలని గట్టిగా డిమాండ్‌ చేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పాత్రదారులే వేరు... అదే రంగస్థలం... అదే కథ.. అదే స్క్రీన్‌ప్లే పునరావృత్తం అవుతూనే ఉంటాయి.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Email: peoplespulse.hyd@gmail.com

ఐవీ మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చర్

(డిస్‌క్లెయిమర్: వ్యాసంలోని అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం, అలాగే ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవి మాత్రమే. హెచ్‌టీ తెలుగువి కావు..)

తదుపరి వ్యాసం