TSPSC Group 1 : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాల వెల్ల‌డికి లైన్ క్లియర్..-telangana high court permits tspsc to declare group 1 prelims results ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana High Court Permits Tspsc To Declare Group 1 Prelims Results

TSPSC Group 1 : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాల వెల్ల‌డికి లైన్ క్లియర్..

HT Telugu Desk HT Telugu
Jan 11, 2023 09:09 PM IST

TSPSC Group 1 : గ్రూప్- 1 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడికి హైకోర్టు అనుమతించింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదం అంశంలో టీఎస్‌పీఎస్సీ అప్పీలుపై విచారణ జరిపిన హైకోర్టు... అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటర్‌ దాఖలు చేయాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది.

గ్రూప్ - 1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి అనుమతి
గ్రూప్ - 1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి అనుమతి (HT_PRINT)

TSPSC Group 1 : లక్షల మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షల ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. గ్రూప్- 1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదం అంశంలో టీఎస్‌పీఎస్సీ అప్పీలుపై విచారణ జరిపిన హైకోర్టు... అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటర్‌ దాఖలు చేయాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి టీఎస్పీఎస్సీ కి అనుమతి ఇచ్చింది. అభ్యర్థి స్థానికత వివాదం తర్వాత తేలుస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో... గురు లేదా శుక్రవారాల్లో ఫలితాలు వెల్లడించేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రాథమిక పరీక్ష తేదీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌ చివరి వారంలో గ్రూప్‌ 1 మెయిన్‌ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక పరీక్షలకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గత ఏడాది అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,85,916 మంది హాజరయ్యారు. అక్టోబరు 29న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ ప్రాథమిక కీ ప్రకటించి, అభ్యంతరాలు ఆహ్వానించింది. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలపై సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలించి 5 ప్రశ్నలను తొలగించింది. ఈ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ నవంబరు 15న తుది కీ ప్రకటించింది. మాస్టర్‌ ప్రశ్నపత్రం ప్రకారం టిఎస్‌పిఎస్సీ 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించింది.

గ్రూప్‌-1 పరీక్షలో మొత్తం 150 మార్కులకు 5 ప్రశ్నలను తొలగించడంతో 145 ప్రశ్నలకు వచ్చిన మార్కులను 150 మార్కులకు దామాషా పద్ధతిలో తుది మార్కులను లెక్కించింది. ఓ అభ్యర్థికి ప్రాథమిక పరీక్షల్లో 145 మార్కులకు 120 వస్తే వాటిని 150కి లెక్కించి అభ్యర్థికి వచ్చిన మార్కుల్ని 124.137గా నిర్ణయిస్తారు. మార్కుల జాబితాను మూడో డెసిమల్‌ పాయింట్‌ వరకు లెక్కించి ఆ తర్వాత మెయిన్స్ కి ఎంపికైన వారి మెరిట్‌ జాబితాను కమిషన్‌ ఇప్పటికే రూపొందించినట్లు సమాచారం. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 1:50 నిష్పత్తిలో ప్రకటించాలని కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు... ప్రధాన పరీక్షకు మొత్తం 25,150 మందిని ఎంపిక చేయనుంది. మల్టీజోన్లు, రిజర్వుడు వర్గాల వారీగా జాబితాలను క్షుణ్నంగా పరిశీలిన చేసిన తర్వాత... అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఫలితాల వెల్లడికి సిద్ధమైనట్లు సమాచారం.

IPL_Entry_Point