Telangana Voters : ఓటర్ల జాబితాలోకి కొత్తగా ఎన్ని లక్షల మంది చేరుతున్నారో తెలుసా?
Election Commission Of India : తెలంగాణలో కొత్తగా భారీగా ఓటర్లు.. లిస్టులోకి చేరే అవకాశం ఉంది. లక్షల మంది దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన దాదాపు ఆరు లక్షల మంది యువకులు ఓటర్ల జాబితాలో చేరేందుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వారు జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వాళ్లు అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఈ లెక్కన 17 ఏళ్లు పైబడిన వారు కూడా అప్లై చేసుకుంటారు.
భారత ఎన్నికల సంఘం (ECI).. 17 ఏళ్లు దాటిన వాళ్లు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. యువకులు ఎన్నికల గుర్తింపు కార్డు కోసం నవంబర్ 9 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం జనవరి 1కి బదులుగా... ఎన్నికల సంఘం వరుసగా ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 న ఓటర్ల నమోదుకు అర్హత తేదీని నిర్ణయించింది. ఓటర్ల జాబితా ప్రతి త్రైమాసికంలో నవీకరిస్తారు.
ఇప్పటివరకు 18 ఏళ్లు నిండినవారు మాత్రమే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. ఇకపై 17 ఏళ్లు దాటినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది. 18 ఏళ్లు పూర్తికాగానే వారికి ఓటు హక్కు లభిస్తుందని పేర్కొంది. ఓటు హక్కు నమోదు కోసం ఏటా జనవరి ఒకటి వరకు వేచిచూడాల్సిన అవసరం లేదని తెలిపింది. యువతలో ఈ అధునాతన నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళికలు వేస్తోంది.
ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది కొత్త ఓటర్లు.. ఓటర్ల జాబితాలోకి చేరుతున్నారని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. 17 ఏళ్లు దాటిన అభ్యర్థులకు అడ్వాన్స్డ్ ఎన్రోల్మెంట్ను ECI అనుమతించినందున సుమారు ఆరు లక్షల మంది కొత్త ఓటర్లు ఎలక్టోరల్ రోల్స్లో చేర్చబడతారని ఆశిస్తున్నట్టుగా వెల్లడించారు.
ప్రతి త్రైమాసికంలో కొత్త ఓటర్లు ఎలక్టోరల్ రోల్స్లో నమోదు అవుతారు. యువకులు తమ స్వస్థలాల్లో ఓట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే బూత్ స్థాయి అధికారి (బీఎల్ఓ) వివరాలు ఆరా తీస్తారు. జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువకులు తమ దరఖాస్తులను నమోదు, అభ్యంతరాలు, దిద్దుబాట్ల కోసం డిసెంబర్ 8, 2022 వరకు దాఖలు చేయవచ్చు. యువకులు తదుపరి మూడు అర్హత తేదీలలో ఏప్రిల్ 1, జూలై 1, 2023 అక్టోబర్ 1న తమ క్లెయిమ్లను ఫారం-6లో సమర్పించవచ్చు. ముందుగా నవంబర్ 9, 2022 నుండి ప్రారంభించవచ్చు.