JP Nadda: అక్కడ చుక్కలు చూపించాం.. బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడుతున్నాడు-jp nadda attend to the bjp meeting at hanamkonda ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jp Nadda: అక్కడ చుక్కలు చూపించాం.. బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడుతున్నాడు

JP Nadda: అక్కడ చుక్కలు చూపించాం.. బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడుతున్నాడు

Mahendra Maheshwaram HT Telugu
Aug 27, 2022 05:49 PM IST

jp nadda fires on kcr: బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. హన్మకొండ వేదికగా తలపెట్టిన సభలో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

హన్మకొండ సభలో జేపీ నడ్డా
హన్మకొండ సభలో జేపీ నడ్డా (twitter)

bjp public meeting at hanamkonda: హన్మకొండ వేదికహా బీజేపీ భారీ బహిరంగ సభను తలపెట్టింది. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…. టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో అందకారం నిండిపోయిందని అన్నారు. వెలుగులు నింపేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సభను అడ్డుకునేందుకు కుట్రలు చేశారని… న్యాయస్థానం అనుమతితో సభను నిర్వహిస్తామని చెప్పారు.

‘JP Nadda fires on KCR: ’ఓరుగల్లు గడ్డకు నమస్కారం. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నాను. మూడు విడతల్లో సంజయ్ పాదయాత్ర విజయవంతం అయింది. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అందకారంలో ఉంది. వెలుగులు నింపడానేకి సంజయ్ యాత్ర చేపట్టారు. సభను అడ్డుకునేందుకు కుట్ర అన్నిప్రయత్నాలు చేశారు. 144 సెక్షన్ ఉందని జనం రాకుండా అడ్డుకున్నారు. చివరి నిజాం కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టలేదు. మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ దారిలోనే కేసీఆర్ నడుస్తున్నారు. నిజాంను తరిమికొట్టిన తరహాలోనే కేసీఆర్ ను తరిమికొట్టాలి' అని ప్రజలకు పిలుపునిచ్చారు.

త్వరలోనే కేసీఆర్ ను ప్రజలు ఇంట్లో కూర్చొబెడతరాని నడ్డా జోస్యం చెప్పారు. కేసీఆర్ నయానిజాంలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.తెలంగాణలో ప్రజాస్వామ్యాన్నీ కేసీఆర్ బందీ చేశారని ఆరోపించారు. వరద సాయం కింద రూ. 377 కోట్లు కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. కానీ తెలంగాణ సర్కార్ రూ. 200 కోట్లే తీసుకుందని చెప్పారు. జల జీవన్ మిషన్ కింద నిధులు ఇచ్చామని చెప్పారు.

'కేంద్రం ఇచ్చే నిధులను తెలంగాణ సర్కార్ దుర్వినియోగం చేసింది. కాళేశ్వరం అవినీతికి మరోపేరుగా మారింది. 40వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం లక్షా 40వేల కోట్లకు చేరింది. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారింది. మజ్లిస్ భయంలో విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించటం లేదు. తాము అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు పాకింది. కాకినాడ తీర్మానం ద్వారా తెలంగాణకు మొదట మద్దతు పలికిన పార్టీ బీజేపీనే' అని గుర్తు చేశారు. తెలంగాణలో నయా నిజాం పాలన సాగుతోందని.. టీఆర్ఎస్ సర్కారును సాగనంపడమే ప్రజా సంగ్రామ యాత్ర సంకల్పమని నడ్డా స్పష్టం చేశారు.. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని అన్నారు.

‘టీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని వరంగల్ జైలును కూల్చారు. ఇన్ని రోజులు గడుస్తున్నా వరంగల్ లో మల్టీ స్పెషాలిటీ నిర్మించలేదు.బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడుతున్నాడు. దుబ్బాక, హుజురాబాద్ లో కేసీఆర్ కు చుక్కలు చూపించాం. కేసీఆర్ అవినీతి, నియంతృత్వ పాలనను బొందపెడతాం’ - జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు

కేసీఆర్ ను వదిలే ప్రసక్తే లేదు - బండి సంజయ్

Bandi Sanjay Fires on KCR: బీజేపీ కార్యకర్తలను కేసీఆర్ జైల్లో పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తమని జైల్లో పెట్టిన కేసీఆర్ ను కూడా... జైల్లో పెడుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ చర్యలతో రక్తం సలసల మరుగుతోందని వ్యాఖ్యానించారు.

'బీజేపీ ఎప్పుడు మతతత్వాన్ని రెచ్చగొట్టలేదు. బీజేపీ యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. కేసులతో కార్యకర్తలను ఇబ్బంది పెడుతోంది. దేనికి భయపడేదిలేదు. తెగించి కొట్లాడుతాం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు అరెస్ట్ లు చేయిస్తున్నారు. బీజేపీని బూచీగా చూపించి... మత ఘర్షణలను సృష్టించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. ఓ కమెడియర్ కార్యక్రమం పెట్టుకుమంటే 2వేల మంది పోలీసులతో భద్రత కల్పించారు. లిక్కర్ కేసును పక్కదోవ పట్టించేందుకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించేలా చేశారు. కేసీఆర్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేదిలేదు' అని బండి సంజయ్ ఘాటుగా మాట్లాడారు.

IPL_Entry_Point