వాటర్ పెండింగ్ బిల్లులను క్లియర్ చేసుకునేందుకు హైదరాబాద్ జలమండలి వన్ టైం సెటిల్ మెంట్ స్కీమ్ ను మళ్లీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. విజయదశమి పండగ సందర్భంగా ఈ స్కీమ్ ను అమల్లోకి తీసుకొచ్చారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించేందుకు వియోగదారులకు చక్కటి అవకాశం కల్పించింది. ఇందుకోసం వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్-2024) పథకాన్ని మళ్లీ తీసుకొచ్చింది.
ఈ స్కీమ్ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. పెండింగ్ బిల్లుల విషయంలో ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించే సువర్ణ అవకాశాన్ని కల్పించింది. ఈ గడవు మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటివరకు చెల్లించనివారు.. ఈ స్కీమ్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. పేన్ ఫే, గూగుల్ పే, ఆన్ లైన్ మెంట్ పేమెంట్ మాత్రమే కాకుండా క్యూఆర్ కోడ్ ఉపయోగించి కూడా క్లియర్ చేసుకోవచ్చని అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు.
జలమండలిలో నీటి బకాయిలు పెరిగిపోతుండటంతో.. అధికారులు ఈ స్కీమ్ తీసుకువచ్చారు. ఈ ఓటీఎస్ కింద.. వినియోగదారులు తమ బకాయిలను ఎలాంటి ఆలస్య రుసుం, వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. జలమండలిలో గతంలో రెండు సార్లు ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ను అమలు చేశారు. 2016, 2020 లో అమలు చేశారు.
నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ కోసం అధికారులకు స్థాయిని బట్టి అమౌంట్ పరిధిని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం.. మేనేజర్ స్థాయిలో రూ.2000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.2001 నుంచి రూ.10,000 వరకు, జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.10,001 నుంచి రూ.1,00,000 వరకు, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువ మాఫీ చేసే అధికారం ఉంది.