Kanakadhara stotram: శంకరాచార్యులవారు వైశాఖ మాస శుక్ల పక్ష తదియనాడు కేరళ రాష్ట్రంలో కాలడి గ్రామములో భిక్షాటన కోసం పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వెళ్ళగా ఆమె తన ఇంటిలో భగవంతుడు దగ్గర నివేదనగా ఉన్నటువంటి ఉసిరికాయను శంకరులకు భిక్షగా వేసినటువంటి రోజు. ఆ భిక్షను స్వీకరించి కనకధారా స్తోత్రాన్ని శంకరాచార్యులవారు చెప్పినరోజు వైశాఖ మాస శుక్ల పక్ష తదియ అక్షయ తృతీయగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఏ మానవుడికైతే జీవితంలో ధన సమస్యలు ఎదుర్కొంటున్నాడో ధనపరమైనటువంటి విషయాలలో లక్ష్మీ కటాక్షాన్ని పొందాలని చూస్తున్నాడో అటువంటి వారికి కనకధారా స్తోత్రం ఒక వరం అని చిలకమర్తి తెలిపారు. ఈ స్తోత్రాన్ని ప్రతీ శుక్రవారం పారాయణం చేయటం లేదా అక్షయ తృతీయ వంటి పర్వదినాలలో పారాయణ చేయటం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చిలకమర్తి తెలిపారు.
“'కనకధారాస్తవం”' పారాయణ చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది. దారిద్ర్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అష్టలక్ష్ముల సమష్టి రూపమైన మహాలక్ష్మిదేవి అనుగ్రహం ద్వారా దైనందిన జీవితంలో భోగభాగ్యాలు కలగటంతో పాటు శాశ్వతమైన విష్ణులోకప్రాప్తి మహాలక్ష్మి అనుగ్రహంద్వారా కలుగుతుంది. అదే నిజమైన సంపద. అదే నిజమైన లక్ష్మీకటాక్షం అని చిలకమర్తి తెలిపారు. ఈ కనకధారా స్తోత్రం అర్ధాన్ని వివరంగా ఈ క్రింద అందచేస్తున్నాం.
తాత్పర్యం: మొగ్గలతో శోభిల్లే గానుగు చెట్టును ఆడు తుమ్మెద ఆశ్రయించినట్లుగా, గానుగువృక్షం మాదిరి చల్లనివాడూ, నల్లని వాడూ అయిన మహావిష్ణువు ఆనందం వల్ల ఏర్పడిన గగుర్పాటుతో కూడిన శరీరాన్ని మంగళదేవత అనే సార్ధక నామాన్ని ధరించిన శ్రీ మహాలక్ష్మి ఆశ్రయించి ఉంది. ఆమెకు విష్ణు వక్షస్థలమే నివాస భూమి కదా! అట్టి సకలైశ్వర్యాలకూ నిలయములైన ఆ జగజ్జనని కరుణా కటాక్ష వీక్షణాలు నా మీద ప్రసరించి నాకు శుభాలిచ్చు గాక!
తాత్పర్యం: నల్లకలువ మీద ఆడు తుమ్మెద ప్రీతితో వ్రాలినట్లు శ్రీమహా లక్ష్మి సుందరమైన చూపులు ప్రణయంచేత తన నాథుదైన నారాయణుని చూచుటకు ముందుకు సాగుతున్నాయి. ఆయన తన్ను చూచినప్పుడు సిగ్గుతో ఆమె చూపులు వెనుకకు మరలుతున్నాయి. ఈ రీతిగా ప్రణయం చేత, ఆయన తన వైపు చూడనప్పుడు ప్రియుణ్ణి వీక్షిస్తూ, ఆయన చూపులు తన మీదికి వ్రాలినప్పుడు లజ్జతో వెనుకకు మరలుతున్న ఆ కలుముల చెలి కంటి చూపులు నా మీద ప్రసరించి నాకు సిరిసంపదలు అనుగ్రహించును గాక!
తాత్పర్యం: నల్లకలువ పూవు లోపలి భాగంవలె నల్లని కాంతితో విలసిల్లు శ్రీ మహాలక్ష్మి క్రీగంటి చూపు సమస్త స్వర్గ సామ్రాజ్యాధిపత్యాన్ని తన భక్తులకు అనుగ్రహించడానికి శక్తి గలిగి ఉంది. అ చూపు మురాంతకుడైన శ్రీ మహావిష్ణువునకు సైతం మిక్కిలి అనందాన్ని కలిగిస్తుంది. అట్టి ఇందిరాదేవి అరవిరిసిన కను చూపు నాయందు త్రుటికాలం ఒకింత నిల్చియుండుగాక!
తాత్పర్యం: ఇంచుక మూసుకొన్న కన్నులుగల వాడూ, అనందానికి ఆధారమైనవాడూ అయిన నారాయణుని ప్రీతితో పొంది, రెప్ప పాటు లేనిదీ, మదనపరవశమైందీ, అర మూసిన కనురెప్పలు గలదీ అయిన ఓరగంటితో సిగ్గు బరువున స్వామిని వీక్షిస్తున్న రమాదేవి నేత్రదృష్టి నాకు సంపదలు ప్రసాదించుగాక!
తాత్పర్యం: మేఘమందు మెరుపుతీగ విలసిల్లిన చందంగా వానా కాలం మబ్బు మాదిరి నల్లని శరీరచ్చాయగల శ్రీమహావిష్ణువు వక్షస్థలంలో ఏ జగజ్జనని రూపం వెలిగిపోతోందో అ మహాలక్ష్మి మంగళస్వరూపం నాకు శుభాలను ప్రసాదించు గాక!
తాత్పర్యం: ఏ జగజ్జనని కడగంటి చూపులు కౌస్తుభమణిని ధరించినవాడూ, ఐదుతలలుగల మురాసురుణ్ణి సంహరించిన వాడూ అయిన శ్రీమహావిష్ణువు వక్షస్థలంలో ఇంద్రనీల మణిహారాల శోభను వెలయిస్తున్నవో అట్టి ఆ నారాయణుడి కరుణాకటాక్షవీక్షణాలు నాకు మేలు చేకూర్చు గాక!
తాత్పర్యం: శ్రీమహాలక్ష్మి కటాక్షవీక్షణ మహిమ వల్ల మధువను రాక్షసుణ్ణి నిర్మూలించిన నారాయణమూర్తి సమస్త సన్మంగళాలకూ నిలయుడైనాడు. అనురాగభరితమైన ఆ దేవేరి దృష్టి తన మీద వ్రాలడం వల్లనే కామపరవశుడై జగద్రక్షణ కార్యం ఆయన చక్కగా నిర్వర్తిస్తున్నాడు. వాడివేడిలేని ఆ దేవి తిన్నని క్రీగంటి చూపు నా మీద ప్రసరించి నన్ను కృతజ్ఞుడిని కావించు గాక!
తాత్పర్యం: చాతక పక్షి పిల్ల ఎండ వేడిమికి తాళలేక తల్లడిల్లగా వాయు ప్రేరితమై మేఘం వర్షించి ఆ పక్షికూన తాపంబాపి, వాన చినుకులచే దప్పిక దీర్చి, తృప్తి కల్గించిన విధంగా శ్రీమన్నారాయణ మూర్తి ప్రియురాలైన ఇందిరాదేవి కటాక్షమనే కారుమబ్బు కారుణ్యమనే గాలిచే ప్రేరితమై బహుకాలార్జితమైన దుష్కర్మ అనే తాపాన్ని దవ్వులకు తరిమి ధనమనే వానగురిసి నేను అనే చాతక శిశువుకు సంతృప్తి కల్గించుగాక!
తాత్పర్యం: స్వర్గలోక సుఖం కలిగించే యజ్ఞయాగాదులైన శుభకర్మలు అచరించడంలో మనసులేని వారైనప్పటికిని శ్రీ మహాదేవి దృష్టి తమపై ప్రసరించగానే మానవులు అనాయాసంగా స్వర్గపదవిని పొందగల్గుతున్నారు. అట్టి పద్మ గర్భం యొక్క కాంతివంటి కాంతి గల్గిన శ్రీమహాలక్ష్మి కడగంటి చూపులు నాకు ఐశ్వర్యసమృద్ధిని సమకూర్చుగాక!
తాత్పర్యం: లోకాలను సృష్టించే వేళ బ్రహ్మభార్యభారతి అనీ, రక్షణ సమయాన నారాయణుని పత్నియైన నారాయణి అనీ, కాలస్వరూపిణియైన శాకంభరి అనీ, ప్రళభయకాల మందు శంభు రాణియైన గౌరియనీ పేరొంది, ముజ్జగంబుల నేలు మురహరుని ఇల్లాలు శ్రీ మహాలక్ష్మికి నమస్కారాలు తెల్పుతున్నాను.
తాత్పర్యం: యజ్ఞయాగాది పుణ్యకర్మలన్నింటికి ప్రయోజనం సమకూర్చు వేదస్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మికి నమస్కారం. వాత్సల్య... కారుణ్య, సౌశీల్యాది సద్దుణాలకు సముద్ర మగుచు, ఆనందు స్వరూపిణి అయినట్టి శ్రీమహాలక్ష్మికి చేతులు జోడిస్తున్నాను. తామరలం దండెడు ముద్దరాలు, శక్తి స్వరూపిణి అయిన ఇందిరా దేవికి అభివందనం. పరమపురుషుడైన శ్రీమహావిష్ణువునకు ప్రియురాలై, సర్వసమృద్ధితో నొప్పు భార్గవికి ప్రణామం.
తాత్పర్యం: శ్రీమహాలక్ష్మి పద్మంతో సమానమైన ముఖం గలది. ఆమె జన్మించిన చోటు క్షీరసముద్రం. పాలకడలి యందు జన్మించిన చంద్రునితో, అమృతంతో పాటు ఆమె కూడ జన్మించింది. కనుక ఆమె చంద్రసుధాసహోదరి. ఆమె శ్రీమన్నారాయణునకు ప్రియురాలు. అట్టి జగజ్జననికి నమస్కారం. దారిద్యమోచన స్తోత్రంలో లక్ష్మీదేవి పద్మ అని, పద్మాలయ అని, పద్మప్రియ అని, పద్మహస్త అనీ, పద్మాక్షి అని, పద్మసుందరి అని, పద్మోద్భవ అని, పద్మముఖి అని, పద్మమాలాధర అని, పద్నిని అని, పద్మగంధిని అని కీర్తించబడింది. ఆమె ముఖాదులకు పద్మంతో సామ్యం చెప్పడం వల్ల శైత్యసౌరభ్యాలకు ఆమె స్థానమని వర్ణించారు. చంద్రుని తోబుట్టువు అని చెప్పడం వల్ల ఆమె అమృతసహోదరి అని పేర్కొనడం వల్ల ఆమెనెంత సేవించినా తనివితీరదని, ఆమె పుట్టిన చోటు రత్నాకరమనడం వల్ల ఆమె ఆదిగర్భేశ్వరీత్వత్వాన్ని ప్రశంసించినట్లయింది.
తాత్పర్యం: బంగారు తామరగద్దెపై కూర్చుండు మహాలక్ష్మికి వందనము. భూవలయానికి నాయకురాలైన మహాదేవికి నమస్సు, దేవతలు మున్నగు సాధువర్గమునందు కారుణ్యము గల్గిన ఆ చల్లని తల్లికి స్తుతులు. శార్మను ధనుస్సును ధరించు విష్ణుదేవుని ప్రియు రాలగు శ్రీలక్ష్మికి నమస్తుతి.
తాత్పర్యం: భృగుమహాముని పుత్రికయు, విష్ణువు వక్షస్థలంలో నెలకొన్నదియు, పద్మాసనాసీనురాలు, యశోదా దేవి చేత రోటికి కట్టి వేయబడ్డ కేశవుని ప్రియురాలగు లక్ష్మీదేవికి వందనాలాచరిస్తున్నాను.
తాత్పర్యం: నళిన దళాలవంటి నయనాలు గలది, తేజస్స్వరూపిణి, లోకాలకు కన్నతల్లి, సంపత్స్వ రూపిణి, దేవతలు మొదలగు వారి చేత పూజింపబడునది, నందగోపుని పుత్రుడైన శ్రీ కృష్ణునకు ప్రియురాలు అయిన శ్రీమహాలక్ష్మికి నమోవాకాములర్చిస్తున్నాను.
తాత్పర్యం: పద్మపత్రాలవంటి కన్నులు గల తల్లీ! నీకు నమస్కారాలు సమస్త సంపదలను సమకూరుస్తాయి. అన్ని ఇంద్రియాలకు అనందం కల్గిస్తాయి. సామ్రాజ్య వైభవాలను అనుగ్రహిస్తాయి. పాపాలు నిశ్శేషంగా రూపుమాపుతాయి. పూజ్యురాలవైన ఓ మాతా! నీ చరణాలకు వందనాలు సమర్పిస్తున్నాను. నన్ను కృతార్జునుడిని కావించు.
తాత్పర్యం: అమ్మా! శ్రీ మహాలక్ష్మీ! నిన్ను కొలిచేవారికి నీ కృపాకటాక్ష వీక్షణాలు సకలార్థములనూ సంప్రాప్తింపజేస్తాయి. శ్రీహరి ప్రాణ నాయికమైన తల్లీ! నిన్ను మనోవాక్కాయములనే త్రికరణాల చేత సేవిస్తున్నాను. నన్ను అనుగ్రహించు.
తాత్పర్యం: తామరరేకులవంటి కండ్లుగలదీ, తామరమొగ్గ చేత ధరించినదీ, మిక్కిలి తెల్లని జిలుగు కలువ కట్టినదీ, మేనగంధపు పూతతో, మెడలో పూలదండలతో విరాజిల్లునట్టిదీ, మనస్సునకు ఇంపుగొలుపు అందచందాలు గలదీ, ముజ్జగాలకు సిరిసంపదల నొసంగునట్టిదీ, జ్ఞానబలైశ్వర్య వీర్యశక్తి తేజస్సులనే ఆరు గుణాలతో వెలుగొందునదీ, శ్రీమన్నారాయణమూర్తికి జీవితేశ్వరి అయిన ఓ మహాలక్ష్మీ! నన్ను అనుగ్రహించు తల్లీ!
తాత్పర్యం: ఐరావతాది దిగ్గజాలు ఆకాశ గంగా నది జలాలను కనక కలశాలతో కొనివచ్చి తమ తొండాలతో అభిషేకించగా తడిసిన సకలావ యవములు గలదియూ, జగాలన్నింటికీ జననియూ, సమస్తలోకాలకు ప్రభువైన శ్రీమహావిష్ణువు ఇల్లాలును, క్షీరసాగరపుత్రియూ అయిన శ్రీమహాలక్ష్మిని ఉ దయాన్నే నమస్కరిస్తున్నాను.
తాత్పర్యం: పద్మపత్రాలవంటి నేత్రాలుగల శ్రీమన్నారాయణమూర్తికి ప్రియురాలవైన ఓ కమలాంబికా! నా మనవి ఆలకించు. నేను దరిద్రులలో అగ్రేసరుణ్ణి. నీ కృపకు అన్ని విధాలా ఇవ్వు. ఇట్టినన్ను దయారసం తొణికిసలాడే నీ కడగంటి చూపులతో నన్ను కనుగొని ధన్యుణ్ణి గావించు.
తాత్పర్యం: ఎవ్వరు ప్రతిదినం వేదస్వరూపిణి, యజ్ఞయాగాలకు తల్లి అయిన లక్ష్మీదేవిని ఈ స్తోత్రంతో స్తుతిస్తున్నారో వారు అధిక సద్గుణ సంపన్నులు, పరమ భాగ్యోపేతులు అయి ఈ పుడమిలో పండితుల ప్రశంసలకు పాత్రులౌతున్నారు.
తాత్పర్యం: ఎవరు శంకరభగవత్సాదాచార్యులచే రచించబడ్డ ఈ కనకధారా స్తోత్రాన్ని ఉదయ మధ్యాహ్నసాయం కాలాలందు చదువుతారో వారు నవనిధులకు నాయకుడైన కుబేరుడితో సమానులు కాగలరు.
గద్యం
సంపద్యుక్తుడు, పరమహంస పరివ్రాజకాచార్యవర్యుడగు శ్రీ శంకరభగవత్సాదుల రచనలందలి ఈ కనకధారాస్తోత్రం ముగిసింది.
తాత్పర్యం: బిల్వవనం నడుమ సహస్రదళ శోభితమైన పద్మంలో హాయిగ కూర్చుండి యున్నదియూ, కనక కమలం పద్మం వంటి తనచేత ధరించినదియీ, పసిడివంటి దేహకాంతిగలది అగు రమాదేవికి నమస్కరిస్తున్నాను.
తాత్పర్యం: అమ్మా! ధనవంతుల వాకిళ్ల ముందు నిలబడి యాచిస్తూ వారిచ్చే డబ్బుతో బ్రతుకుమని ఈ ప్రాణి నాసట బ్రహ్మదేవుడు వ్రాసిన వ్రాతను నీ కాలితో తుడిచి ధన్యుణ్ణి చేయుము.
తాత్పర్యం: అమ్మా! నీ పుట్టిల్లు పద్మం. మెట్టినిల్లు శ్రీమన్నారాయణుని వక్షప్రదేశం. అ విధంగానే కనికరంతో నా హృదయపద్నాన్ని నీవు క్రీడాగృహంగా చేసుకో తల్లీ!