Boy stripped: ఇంట్లో స్కూల్ బ్యాగ్ మర్చిపోయినందుకు ఏడేళ్ల బాలుడిని స్కూల్ టీచర్లు బట్టలు విప్పి దారుణంగా కొట్టి కరెంట్ షాక్ ఇచ్చిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. బాలుడు ఏడుస్తూ ఇంటికి వచ్చి తనకు జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అలీగఢ్ లోని లోధా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఆ బాధిత బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖేరేశ్వర్ ధామ్ ఆలయం సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జేమ్స్ అనే ఏడేళ్ల బాలుడు యూకేజీ చదువుతున్నాడు. ఒక రోజు స్కూల్ కు స్కూల్ బ్యాగ్ మర్చిపోయి వెళ్లిన జేమ్స్ పై టీచర్ రాక్షసంగా వ్యవహరించారు. ఆ బాలుడి బట్టలు విప్పి, దారుణంగా కొట్టి, కరంట్ షాక్ ఇచ్చారు. స్కూల్ నుంచి ఏడుస్తూ ఇంటికి వచ్చి జేమ్స్ జరిగిన విషయాన్ని పేరెంట్స్ కు చెప్పాడు. వెంటనే జేమ్స్ కుటుంబ సభ్యులు పాఠశాలకు వెళ్లి ఆందోళనకు దిగారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన కుమారుడు స్కూల్ బ్యాగ్ ను ఇంట్లో మరిచిపోయాడని, దాంతో క్లాస్ టీచర్ అతడిని దారుణంగా కొట్టాడని జేమ్స్ తండ్రి దిలీప్ కుమార్ ఆరోపించారు. తన కుమారుడి బట్టలు, బూట్లు తీసేసి కరెంట్ షాక్ లు ఇచ్చి అత్యంత క్రూరంగా హింసించారని తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను పాఠశాల ప్రిన్సిపాల్ ఖండించారు. కరంట్ షాక్ ఇచ్చినట్లు విద్యార్థి చేసిన ఫిర్యాదు అవాస్తవమని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీని అందించేందుకు పాఠశాల యాజమాన్యం సిద్ధంగా ఉందని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. ఆరోపణలు నిరాధారమైనవని ప్రిన్సిపాల్ తెలిపారు.
ఈ ఘటన జరిగిందని జేమ్స్ తల్లిదండ్రులు ఆరోపించిన రోజు.. జేమ్స్ ను అతడి తాత స్కూల్ వద్ద దింపాడు. జేమ్స్ తండ్రి వేరే ఊరికి వెళ్లడం, తల్లి అనారోగ్యంతో ఉండడంతో అతడి తాత జేమ్స్ ను స్కూల్ లో డ్రాప్ చేశారు. స్కూల్ కు వెళ్లే హడావుడిలో స్కూల్ బ్యాగ్ ను జేమ్స్ తీసుకువెళ్లడం మర్చిపోయాడు.