Amarnath Yatra: కశ్మీర్ లోయకు చేరుకున్న తొలి బ్యాచ్ అమర్ నాథ్ యాత్రికులు-amarnath yatra first batch of 4 600 pilgrims reach kashmir valley ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amarnath Yatra: కశ్మీర్ లోయకు చేరుకున్న తొలి బ్యాచ్ అమర్ నాథ్ యాత్రికులు

Amarnath Yatra: కశ్మీర్ లోయకు చేరుకున్న తొలి బ్యాచ్ అమర్ నాథ్ యాత్రికులు

HT Telugu Desk HT Telugu
Jun 28, 2024 08:13 PM IST

2024 సంవత్సర అమర్ నాథ్ యాత్రకు సిద్ధమైన తొలి బ్యాచ్ భక్తులు శుక్రవారం కశ్మీర్ లోయకు చేరుకున్నారు. వారికి జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా స్వాగతం పలికారు. ఈ బ్యాచ్ లో మొత్తం 4,600 మంది యాత్రికులు ఉన్నారు. అమర్ నాథ్ భక్తులకు ముస్లింలు సహా స్థానికులు ఆదరంగా స్వాగతం పలకడం విశేషం.

రేపటి నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం
రేపటి నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం

4,603 మంది యాత్రికులతో వార్షిక అమర్ నాథ్ యాత్ర మొదటి బ్యాచ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శుక్రవారం కాశ్మీర్ లోయకు చేరుకుందని అధికారులు తెలిపారు. జమ్మూ బేస్ క్యాంపులోని భగవతి నగర్ నుంచి ఉదయం జెండా ఊపి లోయలోకి చేరుకున్న యాత్రికులకు పలు చోట్ల స్థానిక ముస్లింలు పోలీసు, సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులతో కలిసి స్వాగతం పలికారు. అమర్ నాథ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు అధికార యంత్రాంగం, ప్రజల నుంచి ఘనస్వాగతం లభించిందని, కుల్గాం, అనంతనాగ్, శ్రీనగర్, బందిపోరా జిల్లాల్లో వారికి పూలమాలలతో స్వాగతం పలికినట్లు అధికారులు తెలిపారు.

yearly horoscope entry point

రెండు మార్గాల ద్వారా..

అనంత్ నాగ్ లోని సంప్రదాయ 48 కిలోమీటర్ల నున్వాన్-పహల్గామ్ మార్గం ద్వారా, అలాగే, గండేర్ బల్ లోని 14 కిలోమీటర్ల బల్తాల్ మార్గం ద్వారా 52 రోజుల అమర్ నాథ్ యాత్రను కొనసాగిస్తారు. ఈ యాత్ర జూన్ 29, శనివారం ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది. దక్షిణ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని ఖాజీగుండ్ ప్రాంతంలోని నవయుగ్ సొరంగం గుండా 231 తేలికపాటి, భారీ వాహనాల్లో లోయకు చేరుకున్న యాత్రికులకు కుల్గాం డిప్యూటీ కమిషనర్ అథర్ అమీర్ ఖాన్, ఎస్ ఎస్ పి కుల్గాం, పౌర సమాజం, వ్యాపార వర్గాలు, పండ్ల పెంపకందారులు, మార్కెట్ సంఘాలు స్వాగతం పలికాయని అధికారులు తెలిపారు. "వారందరికీ మేము స్వాగతం పలుకుతున్నాము. వారికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి' అని అమీర్ ఖాన్ విలేకరులకు తెలిపారు.

బేస్ క్యాంప్ ల్లో విశ్రాంతి

యాత్రికుల కాన్వాయ్ లు విడివిడిగా బల్తాల్, పహల్గామ్ లోని బేస్ క్యాంపులకు బయలుదేరాయని, అక్కడి నుంచి శనివారం తెల్లవారుజామున 3,880 మీటర్ల ఎత్తైన పవిత్ర గుహాలయానికి భక్తులు బయలుదేరుతారని అధికారులు తెలిపారు. పహల్గామ్ నుంచి వెళ్తున్న యాత్రికులకు అనంతనాగ్ లో డిప్యూటీ కమిషనర్ సయ్యద్ ఫక్రుద్దీన్ హమీద్, ఇతర అధికారులు స్వాగతం పలకగా, బల్తాల్ మీదుగా గుహాలయానికి వెళ్తున్న యాత్రికులకు శ్రీనగర్ లోని పంథా చౌక్ వద్ద డిప్యూటీ కమిషనర్ బిలాల్ మొహిఉద్దీన్ భట్, స్థానికులతో సహా ఇతరులు స్వాగతం పలికారు. అనంతరం బండిపోరాలో కాన్వాయ్ కు ఘనస్వాగతం పలికినట్లు అధికారులు తెలిపారు.

ఎల్జీ మనోజ్ సిన్హా శుభాకాంక్షలు

శుక్రవారం ఉదయం 'బమ్ భమ్ భోలే', 'హర హర మహాదేవ్' నినాదాల మధ్య జమ్మూలోని భగవతి నగర్ లోని యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుంచి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తొలి బ్యాచ్ ను జెండా ఊపి ప్రారంభించారు. యాత్రికులు సురక్షితంగా ప్రయాణించాలని సిన్హా ఆకాంక్షించారు. బాబా అమర్ నాథ్ ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ ఏడాది 3.5 లక్షల మంది..

అమర్ నాథ్ యాత్ర సజావుగా సాగేందుకు మూడంచెల భద్రత, ఏరియా డామినేషన్లు, విస్తృతమైన రూట్ మోహరింపు, చెక్ పోస్టులతో సహా సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 19 వరకు వివిధ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తామని, అసౌకర్యాన్ని తగ్గించేందుకు రోజువారీ హెచ్చరికలు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ ఏడాది యాత్రకు 3.50 లక్షల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం. గుహాలయానికి వెళ్లే రెండు మార్గాల్లో 125 కమ్యూనిటీ కిచెన్లు (లంగర్లు) ఏర్పాటు చేయగా, వీటికి 6,000 మందికి పైగా వాలంటీర్లు సహకరిస్తున్నారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.