WWE in Netflix: డబ్ల్యూడబ్ల్యూఈ.. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ను ఇక ఓటీటీ ప్లాట్ఫామ్ పైనా చూసే అవకాశం ఫ్యాన్స్ కు దక్కనుంది. ఈ డబ్ల్యూడబ్ల్యూఈ (WWE)లో బాగా పాపులర్ అయిన మండే నైట్ రా (Monday Night Raw) వచ్చే ఏడాది జనవరి నుంచి ఓటీటీలోకి అడుగు పెడుతోంది.
ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ దీనికోసం ఏకంగా రూ.41560 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. మూడు దశాబ్దాలుగా రెజ్లింగ్ ప్రేక్షకులను అలరిస్తున్న డబ్ల్యడబ్ల్యూఈ తొలిసారి టీవీ నుంచి ఓటీటీలోకి రాబోతుండటం విశేషం.
ఇప్పుడంతా ఓటీటీల హవానే నడుస్తోంది. పెద్ద పెద్ద సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీటీల ద్వారా ప్రతి ఇంటా ప్రేక్షకులకు దగ్గరవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు దశాబ్దాలుగా అలరిస్తున్న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) కూడా ఓటీటీలోకి వస్తోంది. జనవరి, 2025 నుంచి మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
దీనికోసం ఏడాదికి సుమారు 40 కోట్ల డాలర్ల ఒప్పందం కుదిరింది. ఇది కనీసం ఐదేళ్లకుపైనే సాగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ రా(Raw) కోసం డబ్ల్యూడబ్ల్యూఈ.. ఎన్బీసీయూనివర్సల్ తో ఐదేళ్ల ఒప్పందం నడుస్తోంది. దీనికోసం ఈ ఇద్దరి మధ్య అప్పట్లో 25 కోట్ల డాలర్ల డీల్ కుదిరింది. ఈ డబ్ల్యూడబ్ల్యూఈతో నెట్ఫ్లిక్స్ రీచ్ మరింత పెరుగుతుందని ఆ సంస్థ సీఓఓ బేలా బాజారియా అన్నారు.
మండే నైట్ రా ఈవెంట్ ను ప్రస్తుతం ఎన్బీసీయూనివర్సల్ టెలికాస్ట్ చేస్తుండగా.. వచ్చే ఏడాది జనవరి నుంచి యూఎస్, కెనడా, యూకే, లాటిన్ అమెరికా ప్రాంతాల్లో నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. క్రమంగా అన్ని దేశాలకూ దీనిని విస్తరించనున్నారు. అమెరికా బయట జరిగే అన్ని డబ్ల్యూడబ్ల్యూఈ షోలనూ స్ట్రీమింగ్ చేయడానికి కూడా నెట్ఫ్లిక్స్ సిద్ధమవుతోంది.
ఇప్పటికే నెట్ఫ్లిక్స్ కు ప్రధాన పోటీదారు అయిన అమెజాన్ 2023 నుంచి పదేళ్ల కాలానికి గాను నేషనల్ ఫుట్బాల్ లీగ్ కు చెందిన థర్స్డే నైట్ ఫుట్బాల్ ఈవెంట్ ను స్ట్రీమింగ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడీ మండే నైట్ రా ఈవెంట్ తో అమెజాన్ కు గట్టి పోటీ ఇవ్వాలని నెట్ఫ్లిక్స్ భావిస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ కే పరిమితం కాకుండా.. ఇలాంటి లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్లతోనూ నెట్ఫ్లిక్స్ ప్రేక్షకుల మరింత చేరువ కావాలని చూస్తోంది.
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ కు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మూడు దశాబ్దాలకుపైగా ఈ రెజ్లింగ్ కంపెనీ కోట్లాది మంది అభిమానులను అలరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈవెంట్లను నిర్వహిస్తోంది. గతేడాది తొలిసారి హైదరాబాద్ లోనూ డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ జరిగింది. దీనికి వేల మంది ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.