Farzi Most Watched Series: ఫర్జీ అరుదైన ఘనత.. ఎక్కువ మంది చూసిన ఇండియన్ వెబ్‌సిరీస్‌గా రికార్డు-shahid kapoor farzi is now the most watched indian series of all time
Telugu News  /  Entertainment  /  Shahid Kapoor Farzi Is Now The Most Watched Indian Series Of All Time
ఫర్జీ సిరీస్‌లో షాహిద్ కపూర్
ఫర్జీ సిరీస్‌లో షాహిద్ కపూర్ (HT_PRINT)

Farzi Most Watched Series: ఫర్జీ అరుదైన ఘనత.. ఎక్కువ మంది చూసిన ఇండియన్ వెబ్‌సిరీస్‌గా రికార్డు

26 March 2023, 15:33 ISTMaragani Govardhan
26 March 2023, 15:33 IST

Farzi Most Watched Series: షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఫర్జీ వెబ్ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అత్యధిక మంది చూసిన ఇండియన్ వెబ్ సిరీస్‌గా రికార్డు సృష్టించింది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌ను రాజ్-డీకే తెరకెక్కించారు.

Farzi Most Watched Series: బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్-డీకే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ స్పై థ్రిల్లర్ ప్రేక్షకులను విపరీతంగా అలరించడంతో వీరి తదుపరి ప్రాజెక్టులపై కూడా బజ్ ఏర్పడింది. ఇటీవలే ఈ దర్శకద్వయం తెరకెక్కించిన ఫర్జీ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు పాజిటివ్ టాక్ దక్కడమే కాకుండా మంచి విజయాన్ని అందుకుంది. ఎంతలా అంటే ఓటీటీ వేదికల్లో విడుదలైన వెబ్ సిరీస్‌ల్లో ఏది కూడా అందకోనంత అరుదైన రికార్డును నమోదు చేసింది. అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన వెబ్ సిరీస్ ఫర్జీ రికార్డు సృష్టించింది.

ఆర్నామ్యాక్స్ మీడియా సర్వే ప్రకారం ఫర్జీ వెబ్ సిరీస్ ఇండియన్ సిరీస్‌ల్లో ఆల్ టైమ్ అత్యధికంగా చూసిన సిరీస్‌గా ఘనత సాధించింది. ఈ సిరీస్‌ 37.1 మిలియన్ల వ్యూయర్షిప్‌ను సాధించింది. ఈ విషయాన్ని షాహిద్ కపూర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దర్శక ద్వయం రాజ్-డీకే కూడా తమ ఇన్‌స్టా ఖాతా ద్వారా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సిరీస్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, కేకే మీనన్, భువన్ అరోరా, రెజీనా కసాండ్ర, అమోల్ పాలేకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో షాహిద్ కపూర్ సన్నీ అనే కాన్ ఆర్టిస్ట్ రోల్‌లో నటించాడు. నకిలీ వస్తువులను తయారు చేయడంలో నిష్ణాతుడైన సన్నీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చిన్న కాన్ ఆర్టిస్ట్‌గా ఉన్న సన్నీ.. చీకటి ప్రపంచంలో ఎలా ఇరుక్కున్నాడనేది ప్రధాన కథాంశం.

ఫర్జీలో ముఖ్యంగా నకిలీ నోట్ల కుంభకోణం ఆర్థిక ఉగ్రవాదానికి దారితీస్తుందని చెప్పారు. సామాజిక సందేశాన్ని ఇంటెన్స్‌గా చెప్పడంలో దర్శకులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.