Lok sabha elections 2024: ఉత్తరప్రదేశ్ లోని డియోరియాలో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ మంగళవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆ దేవుడు మోదీని రైతులు, కూలీలకు సేవ చేయడానికి పంపించలేదా? అని ప్రశ్నించారు. ‘‘మిగతా వారంతా బయోలాజికల్ గానే జన్మించారు. కానీ నరేంద్ర మోదీజీ మాత్రం బయోలాజికల్ గా జన్మించలేదు. ఆయనను ఆ దేవుడు అంబానీ, అదానీలకు సహాయం చేయడానికి పంపించాడు. అంతేకానీ, రైతులు, కార్మికులను ఆదుకోవడానికి పంపించలేదు’’ అని రాహుల్ గాంధీ వ్యంగ్య విమర్శలు చేశారు.
‘‘పరమాత్మే ఆయనను పంపి ఉంటే ఆయన పేదలకు, రైతులకు సాయం చేసేవాడు. ఆయనను పంపించింది పరమాత్మ కాదు.. వో నరేంద్రమోదీ జీ వాలే పరమాత్మా హై . అందుకని ఆయన ఆదానీ, అంబానీలకు మాత్రమే సాయం చేస్తాడు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం ప్రారంభించిన అగ్నిపథ్ పథకాన్ని తాము అధికారంలోకి రాగానే చెత్తబుట్టలో వేస్తానని రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల (lok sabha elections 2024) ప్రచారంలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ (Rahul gandhi) చెప్పారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామన్నారు.
తాను బయోలాజికల్ గా జన్మించలేదని, తనను ఆ దేవుడే ఈ భూమి పైకి పంపించాడని ప్రధాని మోదీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘‘మా అమ్మ బతికి ఉన్నంత వరకు నేను బయోలాజికల్ గా పుట్టానని అనుకునేవాన్ని. ఆమె మరణానంతరం నా అనుభవాలు గమనించినప్పుడు నన్ను దేవుడు పంపాడని అర్థమైంది. ఈ బలం నా శరీరానిది కాదు. అది భగవంతుడు నాకు ఇచ్చాడు. అందుకే భగవంతుడు నాకు ఈ పని చేయగల సామర్థ్యాన్ని, బలాన్ని, నిర్మల హృదయాన్ని, ప్రేరణను కూడా ఇచ్చాడు. నేను దేవుడు పంపిన ఒక సాధనాన్ని తప్ప మరేమీ కాదు’’ అని ఒక ఇంటర్య్యూలో ప్రధాని మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు.