Mahasena Rajesh On Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు మహాసేన రాజేష్ ప్రకటించారు. పవన్ కల్యాణ్ తో పోలిస్తే మా వర్గాలకు జగన్ బెటర్ అనిపిస్తుందని తెలిపారు. పవన్ కల్యాణ్, జగన్ కంటే చంద్రబాబు చాలా చాలా బెటర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ ఓ పోస్టు పెట్టారు. అలాగే యూట్యూబ్ ఓ వీడియో పోస్టు చేశారు. కులం, మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారు ఎవరైనా సరే వారికీ వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ చెప్పారన్న రాజేష్.. పవన్ కల్యాణ్ వలన జరిగే అనర్థాలు ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఇప్పటికే చాలా సహించామన్న ఆయన... జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోను ఓడించడానికి రాజ్యాంగ బద్దంగా పనిచేస్తామని ప్రకటించారు. మాకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదన్న ఆయన.. అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున పోరాడటమే తనకు ఇష్టం అన్నారు. తనకు పదవులు, అధికారం కావాలనుకుంటే జగన్ తోనే ఉండేవాడినన్నారు. పైన ఉన్న నాయకుల్లో నిలకడ లేనపుడు తాను కూడా నిలకడగా ఉండలేనన్నారు.
మహాసేన రాజేష్ జనసేన మద్దతుగా ఉండేవారు. అయితే ఇటీవల ఆయన టీడీపీలో చేరారు. దీంతో చంద్రబాబు ఆయనకు పి.గన్నవరం టికెట్ కేటాయించారు. దీనిని స్థానిక జనసేన నేతలు వ్యతిరేకించారు. స్థానిక నేతల మద్దతు లేకపోవడంతో...పోటీ నుంచి వైదొలుగుతున్నటన్లు రాజేష్ ప్రకటించారు. కొంత కాలం సైలెంట్ ఉన్న ఆయన...తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై జనసేనకు మద్దతు ఇవ్వమని తెలిపారు. అలాగే జనసేన పోటీ చేస్తున్న చోట్ల ఆ పార్టీ ఓటమికి పోరాడమతామన్నారు. యూట్యూబ్ లో పెట్టిన వీడియోలో మహాసేన రాజేష్ పరోక్షంగా వైసీపీకి మద్దతుగా మాట్లాడుతూ.. పవన్ పై మండిపడ్డారు. గతంలో తనను తాను జనసైనికుడిగా ప్రకటించుకుంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదన్నారు. జనసేనలోకి ఆహ్వానించలేదన్నారు. జనసేన కోసం పనిచేసిన దళితుల్ని పవన్ ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. తనకు పి.గన్నవరంలో పోటీ చేసే అవకాశం ఇస్తే అడ్డుకున్నారని ఆరోపించారు. అయితే కూటమి విజయం కోసం ప్రచారం చేస్తుంటే మహాసేన సమావేశాలకు పవన్ ఒక్కసారి కూడా రాలేదన్నారు. పవన్ కల్యాణ్ ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదకరమంటూ విమర్శించారు. జనసేన వల్ల టీడీపీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై జగన్ హీరోలా మాట్లాడారన్నారు.
అయితే జనసేన మద్దతుదారులు మహాసేన రాజేష్ పై మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్ తిట్టడానికే ఉద్దేశపూర్వకంగా వీడియోలు చేస్తున్నారని విమర్శించారు. పి.గన్నవరం టికెట్ పోయిందన్న కోపంలో ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. మహాసేన రాజేష్ తరచూ యూటర్న్ తీసుకుంటారని విమర్శించారు. వైసీపీ నుంచి జనసేన, ఆ తర్వాత టీడీపీ..ఇప్పుడు మళ్లీ వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. తన అవకాశం బట్టి పార్టీలు మారుస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ పై దుష్ప్రచారం చేసేందుకు వైసీపీ... మహాసేన రాజేష్ ను పావుగా వాడుకుంటుందని జనసేన పార్టీ మద్దతుదారులు విమర్శలు చేస్తున్నారు.
సంబంధిత కథనం