ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆదివారం ముంబయి ఇండియన్స్ చాలా సేఫ్ గేమ్ ఆడింది. టాప్ ప్లేయర్లు వేలంలోకి వచ్చినా.. పెద్దగా పట్టించుకోని ముంబయి ఇండియన్స్ చేతిలో చాలినంత డబ్బు ఉన్నా ఉదాసీనంగా వ్యవహరించింది. రోజు మొత్తంలో కేవలం ట్రెంట్ బౌల్ట్ కోసం మాత్రమే సీరియస్గా ట్రై చేసింది. దాంతో గతంలో ముంబయి టీమ్కి ఆడిన చాలా మంది ప్లేయర్లని మిగిలిన ఫ్రాంఛైజీలు ఎగరేసుకుపోయింది. ఇందులో ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. అతడ్ని సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ రూ.11.25 కోట్లకి ఎత్తుకెళ్లిపోయింది.
న్యూజిలాండ్కి చెందిన ట్రెంట్ బౌల్ట్ రూ.2 కోట్ల బేస్ ప్రైజ్తో వేలంలోకి రాగా.. అతడి కోసం ముంబయి రూ.12.5 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికే కుడిచేతి వాటం పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీమ్లో ఉండటంతో లెప్ట్ హ్యాండర్, పవర్ ప్లేలో వికెట్లు తీయగల బౌల్ట్ చేరికతో ఆ జట్టు పేస్ విభాగం బలోపేతమైంది. వేలంలో ఇంకా ముగ్గురుని ముంబయి కొనుగోలు చేసింది. కానీ.. ఆ ముగ్గురినీ రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డు వాడే దక్కించుకోవడం గమనార్హం.
నమన్ ధీర్ను కోసం ఢిల్లీ, రాజస్థాన్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ.. ఆర్టీఎం ప్రయోగించడంతో ముంబయి సొంతమయ్యాడు. 2024లో ముంబయి ఇండియన్స్ జట్టుకి ఆడినధీర్ను గత ఏడాది మినీ వేలంలో రూ.20 లక్షలకే కొనుగోలు చేయడం గమనార్హం. గత ఏడాది 177.21 స్ట్రైక్ రేట్తో ఈ బ్యాటర్ 140 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆదివారం రూ.18.90 కోట్లని మాత్రమే ముంబయి ఇండియన్స్ ఖర్చు చేసింది. అలానే రిటెన్షన్ కోసం ఇప్పటికే రూ.75 కోట్లని ఖర్చు చేయగా.. ఇక ఆ ఫ్రాంఛైజీ వద్ద మిగిలింది రూ.26.10 కోట్లు మాత్రమే.