ఐపీఎల్ 2025 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. పేసర్లు మహ్మద్ షమీని రూ.10 కోట్లకు, హర్షల్ పటేల్ను రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటికే పాట్ కమిన్స్ టీమ్లో ఉండటంతో.. ఈ ఇద్దరి రాకతో టీమ్ పేస్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతమైంది. అలాగే స్పిన్నర్ రాహుల్ చాహర్ రూ.3.2 కోట్లు వెచ్చించింది. అభినవ్ మనోహర్ (రూ.3.2 కోట్లు), ఆడమ్ జంపా (రూ.2.4 కోట్లు), అథర్వ తైడే (రూ.30 లక్షలు) కొనుగోలు చేయడం ద్వారా జట్టులో సమతూకం పెరిగింది.
ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కోసం బిడ్ వేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. వేలానికి ముందు తనకి మంచి ధర రాదని చెప్తూ కనిపించాడు. కానీ.. వేలంలో తొలుత అతని కోసం కోల్కతా బిడ్ వేయగా.. చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగింది. అతని ధర రూ.8.25 కోట్లకు చేరడంతో సీఎస్కే వెనక్కి తగ్గింది. అప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగింది. బిడ్డింగ్ రూ.9.75 కోట్లకు చేరుకుంది, ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ రూ.10 కోట్లకి దక్కించుకుంది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆదివారం రూ.39.85 కోట్లని ఖర్చు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. రిటెన్షన్ కోసం రూ.75 కోట్లని ఖర్చు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు ఆ ఫ్రాంఛైజీ వద్ద రూ.5.15 కోట్లు మాత్రమే ఉన్నాయి.