APPSC GROUP1 : 2018 గ్రూప్‌ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్…-candidates demands to cancel 2018 group 1 notification ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Candidates Demands To Cancel 2018 Group 1 Notification

APPSC GROUP1 : 2018 గ్రూప్‌ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్…

HT Telugu Desk HT Telugu
Jul 26, 2022 11:19 AM IST

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌లో జవాబు పత్రాలను మాన్యువల్ పద్ధతిలో రెండుసార్లు మూల్యంకనం చేయడం వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్ధులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల వెలువడిన గ్రూప్‌ 1 పరీక్షల తుది ఫలితాలు హైకోర్టు ఉత్తర్వులు లోబడి ఉంటాయని ఆదేశాల నేపథ్యంలో మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. మాన్యువల్ మూల్యంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని నోటిఫికేషన్ రద్దు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

గ్రూప్‌ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్
గ్రూప్‌ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్

గ్రూప్‌1 జవాబు పత్రాలను డిజిటల్ పద్ధతిలో కాకుండా మాన్యువల్‌గా దిద్దాలని ఏపీ హైకోర్టు ఆదేశించిన తర్వాత వాటిని రెండు సార్లు మూల్యంకనం చేసినట్లు పలువురు అభ్యర్ధులు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు

నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఇద్దరు ఛైర్మన్లు, ముగ్గురు కార్యదర్శులు మారారని, పెన్ను, పేపర్‌ పద్ధతిలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన తర్వాత ఫిబ్రవరి 25న ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమైన కమిషన్ అంతుచిక్కని కారణాలతో ఆ ప్రయత్నాలను విరమించుకుందని కోర్టుకు వివరించారు. కమిషన్ సభ్యుల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో 2022 మార్చి 25 నుంచి మే వరకు మరోమారు మూల్యాంకనం జరిపి, ఆ తర్వాత ఇంటర్వ్యూలకు 325మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. డిజిటల్ పద్ధతిలో ఎంపికైన వారికి, మాన్యువల్ వాల్యూయేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్ధుల జాబితాలో భారీ వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయని కోర్టుకు ఫిర్యాదు చేశారు.

రెండుసార్లు మూల్యాంకనం....

2021 డిసెంబర్‌లో మాన్యువల్‌గా ప్రశ్నాపత్రాలను దిద్దారు. మూల్యాంకనం కోసం రెండున్నర కోట్ల రుపాయలు ఖర్చు చేశారు. అయితే ఫలితాలను వెల్లడించలేదు. తొలివిడత డిసెంబర్ 6న జవాబు పత్రాలను దిద్దిన వారికి హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ భోజనసదుపాయలు కల్పించింది. డిసెంబర్ 21నుంచి మూల్యాంకనం నిర్వహించారు. మూల్యంకనం, లాజిస్టిక్స్‌ సదుపాయాల కోసం హైదరాబాద్‌ సంస్థకు రూ.1.14కోట్లను ఏపీపీఎస్సీ చెల్లించింది.

2022 ఫిబ్రవరి 24న ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఫలితాలను వెల్లడించే క్రమంలో పలువురి పేర్లను జాబితాలో చేర్చాలని సభ్యులు కోరినా కార్యదర్శి అంగీకరించకపోవడంతో కుదరలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫలితాలను వెల్లడించడంపై ఛైర్మన్, సభ్యులు అభ్యంతరం చెప్పారని కోర్టుకు తెలిపారు.

ఫిబ్రవరి 27న ఏపీపీఎస్సీ కార్యదర్శిగా అహ్మద్ బాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మార్చి 25 నుంచి రెండోసారి మూల్యంకనం నిర్వహించారు. రెండోసారి జవాబు పత్రాలను దిద్దే సమయానికి జవాబు పత్రాలు ఏపీపీఎస్సీకు చేరుకున్నాయని, వాటిలో చేతిరాత వేర్వేరుగా ఉందని ఆరోపించారు.

తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన 42శాతం అభ్యర్ధులు డిజిటల్ మూల్యాంకనంలో ఉత్తీర్ణత సాధించినా మాన్యువల్ పద్దతిలో వారంతా అర్హత కోల్పోయారు. కొందరి జవాబు పత్రాల్లో చేతి రాతలు వేర్వేరుగా ఉండటాన్ని మూల్యాంకనం చేసిన వారు గుర్తించారు. జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిస్తే అక్రమాలు ఎలా జరుగుతాయని, మూల్యాంకనం సమయంలోనే అక్రమాలు జరిగాయని కోర్టుకు ఫిర్యాదు చేశారు.

మాన్యువల్‌గా జవాబు పత్రాలను దిద్దాలనే సింగల్ జడ్జి ఉత్తర్వులను తమకు అనువుగా మార్చుకుని రెండోసారి మూల్యాంకనం చేశారని ఆరోపించారు. గ్రూప్‌ 1 నియామకాల్లో అక్రమాలు జరిగినందున 2018 గ్రూప్‌1 నోటిఫికేషన్ రద్దు చేయాలని పిటిషనర్లు హైకోర్టును అభ్యర్ధించారు.

ఒక్కసారే చేతితో దిద్దారు...

గ్రూప్1 నోటిఫికేషన్ రద్దు చేయాలనే పిటిషనర్ల డిమాండ్ నేపథ్యంలో డిజిటల్ మూల్యాంకనాన్ని మాన్యువల్ పద్ధతితో పోల్చవద్దని ఏపీపీఎస్సీ కోర్టును కోరింది. డిజిటల్ పద్ధతిలో 325మంది అర్హత సాధిస్తే కోర్టు ఆదేశాలతో మాన్యువల్ పద్ధతిలో దిద్దారని వివరించారు. డిజిటల్ పద్ధతిలో అర్హత సాధించిన వారిలో 202మంది మాన్యువల్‌ పద్ధతిలో అర్హత పొందలేదని చెప్పారు.

అర్హత పొందని వారిలో 20శాతం మంది కోర్టుకు వె‌ళ్లారని, మూడు క్యాంపస్‌లలో 162మంది జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారని చెప్పారు. ఏ అభ్యర్ధి పత్రాలను దిద్దుతున్నారో ఎగ్జామినర్లకు తెలిసే అవకాశం ఉండదన్నారు. మూల్యాంకనం చేసే వారి వివరాలు ఏపీపీఎస్సీ బయటపెట్టలేదని ఒక్కసారే దిద్దారని స్పష్టం చేశారు. ఒక్కో జవాబు పత్రాన్ని ఇద్దరు ఎగ్జామినర్లు రెండుసార్లు దిద్దుతారని, 15శాతం కంటే మార్కుల్లో తేడా వస్తే మూడోసారి దిద్దుతారని చెప్పారు. గ్రూప్‌ 1 రద్దు చేయమని కోరడం దురుద్దేశపూర్వకమని ఏపీపీఎస్సీ ఆరోపిస్తోంది

WhatsApp channel

టాపిక్