AP Govt On Covid Cases: కొవిడ్ గుబులు.. కొత్త వేరియంట్లపై ఆరోగ్యశాఖ ప్రకటన
Covid Situations in AP: మళ్లీ కొవిడ్ విజృంభిస్తోంది. పలు దేశాల్లో కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. అయితే ఏపీలోని తాజా పరిస్థితులపై వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది.
ap health department statement on covid situations: కొవిడ్ ముప్పు మళ్లీ తెరపైకి వస్తోంది. చైనా సహా పలు దేశాల్లో కేసుల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం అలర్ట్ ఇచ్చింది. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న చోట కచ్చితంగా మాస్క్ ధరించాలని, కొవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తూ ప్రకటన ఇచ్చింది. అయితే ఏపీలోని తాజా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసులు, వేరియంట్ల వివరాలను వెల్లడించింది.
కొవిడ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ స్పష్టం చేశారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. నవంబర్ నెల నుంచి దాదాపు 30 వేల శ్యాంపిళ్లను టెస్ట్ చేయగా 130 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించారు. అన్నీ ఒమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్లేవీ నమోదు కాలేదని వెల్లడించారు. జినోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేశామని... రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ , ఐసియు బెడ్లు సిద్ధంగా ఉంచామని... ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు , మందులు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.
కేంద్రం ప్రకటన...
భారత్ లో కరోనా(corona) అదుపులోనే ఉందని, అయితే, అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడం అవసరమని కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకైతే, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించిన నిబంధనలను మార్చడం లేదని, ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే కొనసాగుతాయని వివరించింది. కరోనా ముప్పు పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒకవేళ కేసుల సంఖ్య పెరిగినా, ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్య వ్యవస్థ సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు, కరోనా(corona) పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు గతంలో వినిపించిన కాలర్ ట్యూన్ ను మళ్లీ ప్రారంభించాలని టెలీకాం సంస్థలు నిర్ణయించినట్లు సమాచారం.
చైనా, దక్షిణ కొరియా, జపాన్, అమెరికా, బ్రెజిల్ దేశాల్లో కరోనా(corona) కేసుల సంఖ్య ఇటీవల భారీగా(covid surge) పెరుగుతోంది. దాంతో, అప్రమత్తమైన భారత ప్రభుత్వం బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, భారత్ లో కోవిడ్(covid) పరిస్థితిపై సమీక్ష నిర్వహించింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐసీఎంఆర్(ICMR) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్, National Technical Advisory Group on Immunization (NTAGI) చైర్మన్, ఎన్ కే అరోరా, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, కేంద్ర వైద్యారోగ్య, ఆయుష్, ఫార్మా, బయోటెక్నాలజీ విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు. కోవిడ్(covid) ముప్పు ముగియలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, అన్ని జాగ్రత్తలు తీసుకుని సిద్ధంగా ఉండాలని సంబంధిత విభాగాలను ఆదేశించినట్లు కేంద్రమంత్రి మాండవీయ ఆ సమావేశం అనంతరం ట్వీట్ చేశారు. corona విషయంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసినట్లు వివరించారు.
కరోనా(corona) కేసుల వివరాలను నిశితంగా గణించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ముఖ్యంగా కొత్త వేరియంట్లను గుర్తించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. కోవిడ్ పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ న విస్తృతం చేయాలని కోరింది.