MLAs Babli Case: బిలోలి కోర్టుకు హాజరైన ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఏళ్ళ తరబడి సాగుతున్న బాబ్లీ కేసు విచారణ
17 April 2024, 8:22 IST
- MLAs Babli Case: నీటికోసం పోరాటంలో భాగంగా మహారాష్ట్ర లోని బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన కేసులో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కోర్టుకు హాజరయ్యారు.
బాబ్లీ కేసు విచారణకు హాజరైన తెలంగాణ ఎమ్మెల్యేలు
MLAs Babli Case: బాబ్లీ కేసు Babli Case విచారణలో భాగంగా మహారాష్ట్ర లోని బిలోలి సెషన్ కోర్టు Biloli Sessions Court కు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ Gangula Kamlakar, విజయ రామారావు Vijaya Rama Rao, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ Praksh Goud మాజీ ఎమ్మెల్యేలు హనుమంతు షిండే, కె.ఎస్.రత్నం హాజరయ్యారు.
మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు నిర్మించి నీళ్ళు రాకుండా అడ్డుకోవడంతో 2010లో అప్పట్లో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారీ ఆందోళనకు దిగారు.
బాబ్లీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే వరకు కదలమని భీష్మించడంతో మహారాష్ట్ర పోలీసులకు టిడిపి నాయకులకు మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో మరాఠి పోలీసులు లాఠీ చార్జి చేయడమే కాకుండా చంద్రబాబు తో సహా Telangana TDP తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులపై కేసులు నమోదు చేశారు. ఆ కేసుల విచారణలో భాగంగా మహారాష్ట్రలోని బిలోలి కోర్టుకు హాజరైన తమ వాదనను వినిపించారు.
ఉత్తర తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితిలో ఆందోళన
గోదావరినది లో నీళ్ళు రాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నిర్మించడంతో ఉత్తర తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి ఉండడంతో ఆందోళనకు దిగామని ఎమ్మెల్యే లు గంగుల కమలాకర్, విజయరామారావు తెలిపారు.
నీళ్ళు లేక ఉత్తర తెలంగాణ ప్రజల కష్టాలు చూడలేక మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ గేట్లు ఎత్తి నీళ్ళు ఇవ్వాలని ఆందోళన చేస్తే అక్రమంగా కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసులకు భయపడేది లేదని, తమ ప్రాంత ప్రజలు నీటి కష్టాలు తీర్చేందుకు ఎలాంటి పోరాటానికైన సిద్ధమేనని ఆనాడు పోరుబాట పట్టామని తెలిపారు. ఇప్పటికైనా ప్రజల క్షేమం, తమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాణాలను తెగించి పోరాడుతామన్నారు.
నాడు అంతా టిడిపిలో.. నేడు వేర్వేరు పార్టీల్లో…
బాబ్లీ కి వ్యతిరేకంగా నాడు చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన లో టిడిపి ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు. ఆనాటి పోరాటంలో ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్, టిడిపి జిల్లా అధ్యక్షులుగా విజయరమణారావు, నాయకులుగా ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ప్రస్తుతం గంగుల కమలాకర్, ప్రకాష్ గౌడ్ బిఆర్ఎస్ లో ఉండగా విజయరామారావు కాంగ్రేస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
నాడు ఒకే పార్టీలో ఉండి ఒకే నినాదం తో ఫైట్ చేసిన ఎమ్మెల్యేలు నేడు వెర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ కోర్టు లో కలుసుకుని పాత జ్ణాపకాలను గుర్తు చేసుకుని పిచ్చాపాటిగా ముచ్చట్లు పెట్టారు. పార్టీలు, జండాలు వేరైనా నీళ్ళు కోసం ఎందాకైనా పోరాడుతామని స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)