Yadadri :రేపు యాదాద్రిలో ఉచిత సామూహిక అక్షరాభ్యాసం - వివరాలివే
09 June 2023, 15:04 IST
- Yadadri Temple Latest News: రేపు యాదాద్రిలో ఉచిత సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు పాల్గొనేవారు పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు ప్రకటన విడుదల చేశారు.
రేపు యాదాద్రిలో ఉచిత సామూహిక అక్షరాభ్యాసం
Samuhika Akshara Abhyasam at Yadadri: భక్తులకు అలర్ట్ ఇచ్చారు యాదాద్రి ఆలయ అధికారులు. యాదగిరిగుట్ట స్వామివారి క్షేత్రంలో ఈ నెల 10న సామూహిక అక్షరాభాస్యం నిర్వహించనున్నట్లు తెలిపారు. కొండకింద ఉన్న సత్యనారాయణ వ్రత మండపం హాల్ నంబర్ 2లో సుమారు 100 మంది పిల్లలకు ఉచితంగా నిర్వహించే కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.జూన్ 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.కార్యక్రమంలో పాల్గొనేందుకు పిల్లలకు ఎటువంటి రుసుము ఉండదని పేర్కొన్నారు. అక్షరాభ్యాసం చేయించుకునేవాళ్లు ఇవాళ (జూన్ 9) పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఈవో కోరారు.
డ్రోన్లపై ఆంక్షలు..
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చెంత డ్రోన్ కెమెరాలతో ఇష్టానుసారంగా చిత్రీకరణలు కంగారు పుట్టిస్తున్నాయి. దృశ్యాలను యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఆలయ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆలయం చెంత డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం నిషేధించామని.... ఒకవేళ చిత్రీకరణ ముఖ్యమైనదిగా, తప్పనిసరిదిగా భావిస్తే దేవస్థానం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు ఆలయ ఈవో గీతారెడ్డి. ఏం చిత్రీకరిస్తున్నారో ముందే రాతపూర్వకంగా పేర్కొనడం, చిత్రీకరణ అనంతరం దృశ్యాలను చూపడం చేయాలన్నారు. తాము సూచించిన నిషేధిత ప్రాంతాలను చిత్రీకరించొద్దని స్పష్టం చేశారు. నిబంధనలు పాటిస్తేనే షరతులపై అనుమతినిస్తామని చెప్పారు.
మరోవైపు యాదాద్రి పుణ్యక్షేత్రానికి గురువారం భక్తుల తాకిడి పెరిగింది. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ భారీగా కనిపించింది. నిత్యారాధనల్లో భాగంగా పూజారులు వైష్ణవ ఆచారంగా స్వామిని మేలుకొల్పి నిత్య కైంకర్యాలకు శ్రీకారం చుట్టారు. రాత్రి స్వయంభువులకు ఆరాధన, సహస్రనామార్చన నిర్వహించారు.