Telangana Govt : త్వరలో రైతు కమిషన్... 'రైతు భరోసా' స్కీమ్ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన
02 March 2024, 6:34 IST
- CM Revanth Reddy News: రైతు భరోసా స్కీమ్ పై కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం అని… ఈ స్కీమ్ ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Latest News: రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం పౌర సమాజం ప్రతినిధులతో సమావేశమైన ఆయన… త్వరలోనే ఈ రెండు కమిషన్ లను ప్రకటించబోతున్నామని పేర్కొన్నారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని చెప్పారు. ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నామని… పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేశామన్న ఆయన… యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామని వెల్లడించారు. కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నామని వెల్లడించారు. రైతు భరోసా(Rythu Bharosa Scheme) అనేది పెట్టుబడి సాయం అని… ఈ స్కీమ్ ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామని చెప్పారు.
ఫసల్బీమా యోజనలోకి ‘తెలంగాణ’…
రైతులకు దన్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సాగు రంగంలోని ప్రతికూలతలు తట్టుకుంటూ రైతులకు రక్షణగా నిలిచేందుకు ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ (పీఎంఎఫ్బీవై)లో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరింది.
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీఎంఎఫ్బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఎంఎఫ్ బీవైలో 2016 నుంచి 2020 వరకు తెలంగాణ ఉన్న విషయం, ఆ తర్వాత నాటి ప్రభుత్వం దాని నుంచి ఉప సంహరించుకున్న తీరుపై చర్చ జరిగింది.
పీఎంఎఫ్బీవైలోకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగిచేరడంతో వచ్చే పంట కాలం నుంచి రైతులు ఈ పథకం నుంచి పంటల బీమా పొందనున్నారు. పీఎంఎఫ్ బీవైతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని, పంటలు నష్టపోయినప్పుడు సకాలంలోనే పరిహారం అందుతుందని రితేష్ చౌహాన్ తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందిస్తూ… రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో రైతు కేంద్రిత విధానాల అమలుకు ప్రాధా()న్యం ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి రఘునందన్రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.
ఎలివేటేడ్ కారిడార్లకు కేంద్రం అనుమతి
హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖను అందించారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి శుక్రవారం అనుమతులు జారీ చేసింది.
అనుమతులు జారీ చేయటంపై ప్రధాని మోదీతో పాటు కేంద్ర రక్షణశాఖ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎనిమిదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించటంతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైందన్నారు. హైదరాబాద్ నుంచి శామీర్పేట, హైదరాబాద్ నుంచి మేడ్చల్ దిశగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోనున్నాయని తెలిపారు.