Shoaib Akhtar on Ind vs Eng: ఇంగ్లండ్ చేజ్ చేస్తే ఇండియా చిత్తుగా ఓడుతుంది: షోయబ్ అక్తర్
10 November 2022, 11:35 IST
- Shoaib Akhtar on Ind vs Eng: ఇంగ్లండ్ చేజ్ చేస్తే ఇండియా చిత్తుగా ఓడుతుందని అన్నాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. నిజానికి ఈ మ్యాచ్లో ఎవరు చేజ్ చేస్తే వాళ్లదే విజయమని చెప్పాడు.
షోయబ్ అక్తర్, జోస్ బట్లర్, రోహిత్ శర్మ
Shoaib Akhtar on Ind vs Eng: ఇండియా, ఇంగ్లండ్ మధ్య టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. పైగా ఇప్పటికే పాకిస్థాన్ ఫైనల్ చేరడంతో ఇప్పుడు ఇంగ్లండ్ను ఓడించి ఇండియా ఫైనల్ చేరాలని, చారిత్రక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో టైటిల్ కోసం దాయాదులు పోరాడాలని క్రికెట్ ప్రపంచమంతా కోరుకుంటోంది.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ఇదే కోరుకుంటున్నాడు. కానీ పాకిస్థాన్ 1992 చరిత్రను పునరావృతం చేస్తుందని కూడా అతడు అంటున్నాడు. "ఇండియా, పాకిస్థాన్ మధ్య ఫైనల్ జరగాలని కోరుకుంటున్నాను. కానీ 2022లో పాకిస్థాన్ చరిత్రను పునరావృతం చేస్తుంది. 1992లో జరిగినట్లే ఇప్పుడూ జరుగుతుంది. అప్పుడు కూడా న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్ చేరింది. ఇక ఇప్పుడు ఇంగ్లండ్ కూడా ఇండియాను ఓడించి ఫైనల్ వస్తే.. ఆ టీమ్ను ఓడించి పాకిస్థాన్ విశ్వవిజేతగా నిలుస్తుంది" అని అక్తర్ చెప్పడం విశేషం.
1992లో జరిగిన వన్డే వరల్డ్కప్లో పాకిస్థాన్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా సెమీస్లో న్యూజిలాండ్నే పాక్ చిత్తు చేసింది. ఇక మరో సెమీస్లో సౌతాఫ్రికాను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్ చేరింది. ఫైనల్లో ఇంగ్లండ్ను పాక్ చిత్తు చేసింది. అప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్గా దిగిన ఆస్ట్రేలియా సొంతగడ్డపై తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఇప్పుడూ అదే జరిగింది. దీంతో చరిత్ర రిపీట్ అవుతుందని పాక్ అభిమానులు ఆశతో ఉన్నారు.
ఇక ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్లో ఎవరు చేజ్ చేస్తే వాళ్లదే విజయమని కూడా అక్తర్ చెప్పాడు. "ఇండియా చేజ్చేస్తే ఇంగ్లండ్ కూడా ఒత్తిడితో సతమతమవుతుంది. ఒకవేళ ఇంగ్లండ్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఇండియాను చిత్తుగా ఓడిస్తుంది. ఎవరు చేజ్ చేసినా వాళ్లు సులువుగా గెలుస్తారు. ఇందులో ఎక్కువ మజా మాత్రం ఐసీసీకి, బ్రాడ్కాస్టర్లకు వస్తుంది" అని అక్తర్ అనడం విశేషం.