Rajasthan vs Delhi IPL 2023: దిల్లీని చిత్తు చేసిన రాజస్థాన్.. బౌలర్ల విజృంభణతో ఘన విజయం
08 April 2023, 19:42 IST
- Rajasthan vs Delhi IPL 2023: గువహటీ వేదికగా దిల్లీతో జరిగిన ఐపీఎల్ 11వ మ్యాచ్లో రాజస్థాన్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. దిల్లీ బ్యాటర్లలో వార్నర్ మినహా మిగిలిన వారు విఫలం కావడంతో పరజాయం పాలైంది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, బౌల్ట్ చెరో మూడు వికెట్లు తీశారు.
దిల్లీపై రాజస్థాన్ గెలుపు
Rajasthan vs Delhi IPL 2023: దిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. గువహటీ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో దిల్లీ ఓడిపోయింది. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 142 పరుగులే చేయగలిగింది. ఫలితంగా రాజస్థాన్ 57 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గత మ్యాచ్లో పంజాబ్ చేతిలో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న రాజస్థాన్ ఈ సారి మాత్రం అన్నీ రంగాల్లోనూ మెరుగ్గా రాణించి విజయాన్ని అందుకుంది. దిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ డేవిడ్ వార్నర్(65) అర్ధ శతకంతో ఆకట్టుకున్నప్పటికీ తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. అతడితో పాటు లలిత్ యాదవ్(38) మినహా మిగిలినవారంత కొన్ని పరుగులకే పెవిలియన్ చేరారు. రాజస్థాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ చెరో 3 వికెట్లతో ఆకట్టుకోగా.. అశ్విన్ 2 వికెట్లతో రాణించాడు.
200 పరుగుల లక్ష్య ఛేదనలో దిల్లీకి శుభారంభమేమి దక్కలేదు. పరుగులేమి మొదలుకాకముందే ఓపెనర్ పృథ్వీషాను(0) బౌల్ట్ అవుట్ చేశాడు. అదే ఓవర్లో మనీష్ పాండేను(0) కూడా ఎల్బీగా వెనక్కి పంపి దిల్లీని కోలుకోలేని దెబ్బకొట్టాడు. దీంతో 0కే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది దిల్లీ. ఇలాంటి సమయంలో కెప్టెన్ వార్నర్ నిలకడగా ఆడి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. అయితే కాసేపటికే రిలే రుసోను(14) అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో దిల్లీ స్కోరు మరింత నెమ్మదించింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్తో కలిసి డేవిడ్ వార్నర్ నిలకడగా ఆడాడు. వీరిద్దరూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు వేగాన్ని పెంచారు. దీంతో నాలుగో వికెట్కు వీరిద్దరూ 62 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడిని బౌల్డ్ విడదీశాడు. లలిత్ యాదవ్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో దిల్లీ ఆత్మ రక్షణ ధోరణితో ఆడింది. అప్పటి నుంచి వరుసగా వికెట్లు కోల్పోవడం.. రన్ రేట్ పెరిగడంతో వార్నర్ జట్టు ఓటమి అంచున నిలిచింది.
మరోపక్క డేవిడ్ వార్నర్ అర్ధశతకం చేసినప్పటికీ.. దూకుడుగా ఆడలేకపోయాడు. వికెట్లు కాపాడుకునే ప్రయత్నంలో నిలకడగా ఆడాడు. వరుసగా వికెట్లు కోల్పోయిన దిల్లీ మ్యాచ్ను చేజార్చుకుంది. 42 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. చివరకు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్లు జాస్ బట్లర్(79), యశస్వి జైస్వాల్(60) అర్ధశతకాలతో విజృభించగా.. చివర్లో షిమ్రన్ హిట్మైర్(39) మెరుపులు మెరిపించాడు. దిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, రోవ్మన్ పోవెల్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.