Corona deaths |`వారం రోజుల్లో 15 వేల మంది చనిపోయారు`
17 August 2022, 22:03 IST
- Corona deaths | కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. కరోనా ఇంకా మనలను మర్చిపోలేదని, మరోసారి విజృంభించే అవకాశముందని హెచ్చరించింది. ఇప్పటికే, గత నాలుగు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు 35 శాతం పెరిగాయని వెల్లడించింది.
WHO చీఫ్ టెడ్రోస్
Corona deaths | కరోనా మహమ్మారిని ప్రజలు క్రమంగా మర్చిపోతున్నారు. కరోనా ముందునాటి జీవనశైలికి మరోసారి అలవాటు పడుతున్నారు. కరోనా జాగ్రత్తలను కూడా పాటించడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా ముప్పుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మళ్లీ హెచ్చరికలు జారీ చేసింది.
Corona deaths | 35% మరణాలు
కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని WHO చీఫ్ టెడ్రోస్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా ప్రబలంగానే ఉందని గుర్తు చేశారు. దాదాపు 90 శాతం సీక్వెన్స్ల్లో ఒమిక్రాన్కు చెందిన బీఏ 5 వేరియంట్ కనిపిస్తోందన్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ విస్తృతి పెరుగుతోందని, ఏదైనా బలమైన వేరియంట్ వస్తే.. పరిస్థితి చేయిదాటుతుందని హెచ్చరించారు. `కరోనాను ఎదుర్కొని మనం అలసిపోయాం కానీ కరోనా ఇంకా అలసిపోలేదు` అని వ్యాఖ్యానించారు. గత నాలుగు వారాలుగా.. కరోనా మరణాల సంఖ్య దాదాపు 35% పెరిగిందని టెడ్రోస్ వివరించారు. ముఖ్యంగా, గత వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 15 వేల మంది కరోనాకు బలయ్యారని వెల్లడించారు. అన్ని ఆయుధాలు ఉండి కూడా ఇలా వారానికి 15 వేల మందిని కోల్పోవడం ఆమోదనీయం కాదన్నారు.
Corona deaths | జాగ్రత్తలు పాటించాలి
కరోనా మరోసారి విజృంభిస్తే.. వారానికి 15 వేల మరణాలు చోటు చేసుకునే ప్రమాదముందని, ఆ పరిస్థితిని తట్టుకోలేమని టెడ్రోస్ హెచ్చరించారు. మరణాల విషయాన్ని పక్కనపెడ్తే.. కరోనా కేసుల సంఖ్య మాత్రం మరోసారి పెరిగే ప్రమాదముందన్నారు. `కరోనాతో సహజీవనం అంటే అది అంతరించిపోయిందని భావించడం కాదు. కరోనా జాగ్రత్తలు పాటించడాన్ని కొనసాగించాలి` అన్నారు.
Corona deaths | వ్యాక్సీన్ వేసుకోండి
కరోనాను ఎదుర్కోవడానికి ప్రధాన ఆయుధం వ్యాక్సీన్ అని, వ్యాక్సినేషన్ విషయంలో అశ్రద్ధ వద్దని టెడ్రోస్ సూచించారు. `ఇప్పటికే రెండు డోసులు వేసుకుని ఉంటే, బూస్టర్ డోస్ వేసుకోండి` అని సలహా ఇచ్చారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం కొనసాగించాలన్నారు. `రానున్న రోజుల్లో చలి వాతావరణం పెరుగుతుంది. దానివల్ల కోవిడ్తో పాటు ఇన్ఫ్లుయెంజా తదితర వ్యాధులు పెరిగే ప్రమాదముంది` అని వివరించారు.