Tomato price Hyderabad : కేజీ టమాట రూ.100.. సామాన్యుడికి షాక్!
26 June 2023, 12:33 IST
Tomato price Hyderabad : మార్కెట్లో టమాటా ధరలు పెరిగిపోతున్నాయి. త్వరలోనే కేజీ టమాటా ధర రూ. 100ని తాకొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా సామాన్యుల గుండెల్లో ఆందోళన మొదలైంది.
ఆకాశాన్ని తాకనున్న టమాటా ధరలు.. కేజీ @రూ. 100!
Tomato price Hyderabad : మధ్యతరగతి ప్రజలకు భారీ షాక్! వంటల్లో ఎక్కువగా వాడే టమాటా ధరలు త్వరలోనే భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేజీ టమాటా రూ. 100ను కూడా తాకే అవకాశం ఉన్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. మార్కెట్లో డిమాండ్కు తగ్గ సరఫరా జరగకపోతుండటం ఇందుకు కారణమని తెలుస్తోంది.
టమాటా ధరకు రెక్కలు..!
గత వారంలో టమాటా ధరలు అనేక ప్రాంతాల్లో కేజీకి రూ. 80ని కూడా తాకాయి. మరీ ముఖ్యంగా కర్ణాటకలో ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కోలర్ హోల్సేల్ మార్కెట్లో ఆదివారం 15కేజీల టమాటాను రూ. 1,100కి అమ్మినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే రానున్న రోజుల్లో రీటైల్ మార్కెట్లో టమాటా ధరలు కచ్చితంగా పెరుగుతాయి!
"గతేడాదితో పోల్చుకుంటే టమాటాను ఈ ఏడాది తక్కువగా పండిచడంతోనే ధరలు పెరుగుతున్నాయి. గతేడాది బీన్స్ ధరలు భారీగా పెరగడంతో ఈసారి వాటిని ఎక్కువగా పండిస్తున్నాము. రుతుపవనాలు సరిగ్గా లేకపోవడంతో కూడా టమాటా పంటలు నాశనమైపోయాయి. ఇవన్నీ చూసుకుంటే.. సాధారణంతో పోల్చుకుంటే ఈసారి టమాటాలు 30శాతమే ఉండొచ్చు," అని కోలర్ ప్రాంతానికి చెందిన ఓ రైతు ఓ జాతీయ మీడియాకు వెల్లడించాడు.
గత నెలలో టమాటా ధరలు కేజీకి రూ. 3-5 పడ్డాయి. గిట్టుబాటు ధర లేక అనేకమంది రైతులు టమాటాలను పడేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టామాటాల సప్లై లేకపోవడంతో ధరలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది!
ఇదీ చూడండి:- Tomatoes and Pains | ఆ నొప్పులు ఉన్నవారు టమోటాలు తినకూడదు!
Tomato prices rise : ఇక దేశవ్యాప్తంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉంది. మహారాష్ట్రలో టమాటాల సప్లై సరిగ్గా లేకపోవడంతో పశ్చిమ్ బంగాల్, ఒడిశా నుంచి తెప్పించుకుంటున్నారు. కొందరైతే.. బంగ్లాదేశ్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. వీటికి చాలా ఖర్చు అవుతుంది.
దిల్లీలోని మార్కెట్లలో గత రెండు రోజుల్లోనే టమాటా ధరలు రెండింతలు పెరిగాయి. ఉత్తర్ ప్రదేశ్, హరియాణా నుంచి తమకు సరకు ఇంకా అందలేదని, షార్టేజ్ కారణంగా ధరలు పెంచుతున్నామని మార్కెట్ వర్గాలు చెప్పాయి.
టమాటాలు మాత్రమే కాదు.. ఉల్లిగడ్డ, బీన్స్, కాప్సికమ్ వంటి కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో కేజీ బీన్స్ ధర రూ. 100- రూ. 140 పలుకుతోంది. కేజీ క్యారెట్ రూ. 100 మార్క్ను తాకింది. గుడ్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. కిలోపై రూ. 7-8 ధర పెరిగింది.
ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందా..?
Tomato price hike : ద్రవ్యోల్బణం కారణంగా గతేడాది సామాన్యులు అల్లాడిపోయారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. కానీ గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం దిగొస్తోంది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ధరలు ఇలా పెరుగుతుండటం అటు ప్రజలను ఇటు అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.