Pulwama Encounter | పుల్వామా ఎన్కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం
24 April 2022, 22:29 IST
- జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని పాహూ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో భద్రతా బలగాలు ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులను హతమార్చాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు జమ్ముకశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పంచాయతీ రాజ్ దినోత్సవంపై మాట్లాడటంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్ లో పర్యటించారు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తొలుత పుల్వామాలోని పాహు ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ప్రతిఘటించిన బలగాలు.. వారికి దీటుగా బదులిచ్చాయి. ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. లష్కరే తోయిబాకు డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ ఆరిఫ్ హజార్ సహా మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. మిగిలిన ఇద్దరి వివరాలు తెలియాలి.
శనివారం రోజున జమ్మకశ్మీర్లోని కుల్గామ్లోని మిర్హామా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్కు చెందిన ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు సుల్తాన్ పఠాన్, జబీవుల్లా హతమయ్యారు. దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్లోని మిర్హామా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడ తనిఖీలు చేశారు.
దాగి ఉన్న ఉగ్రవాదులు.. భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ కాస్త ఎన్కౌంటర్గా మారిందని ఓ అధికారి తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థాన్కు చెందిన జేఎం ఆత్మాహుతి దళంలో భాగమేనని, ప్రధాని పర్యటనను విధ్వంసం చేసేందుకు చొరబడినట్టుగా అనుమానిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దిల్బాగ్ సింగ్ చెప్పారు. మూడు రోజుల్లో కశ్మీర్ లోయలో ఇది మూడో ఎన్కౌంటర్.