Ratan Tata invests | వృద్ధాప్యంలో తోడు అవసరంపై రతన్ టాటా కీలక వ్యాఖ్యలు
16 August 2022, 17:39 IST
Ratan Tata invests in companionship start up | serviceభారతదేశ పారిశ్రమిక దిగ్గజం, టాటా గ్రూప్ సంస్థల మాజీ చైర్మన్ రతన్ టాటా ఒక కొత్త స్టార్ట్ అప్లో పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశారు. అయితే, ఆ స్టార్ట్ అప్లో ఆయన ఎంత మొత్తం పెట్టబడి పెట్టారనే విషయంలో స్పష్టత లేదు.
రతన్ టాటా
Ratan Tata invests in companionship start up | పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా సీనియర్ సిటిజన్స్కు కంపేనియన్షిప్ సర్వీసెస్ అందించే స్టార్ట్ అప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. గుడ్ఫెల్లోస్(Goodfellows) అనే ఆ స్టార్ట్ అప్లో పెట్టబడులు పెట్టినట్లు రతన్ టాటా మంగళవారం ప్రకటించారు. ఈ గుడ్ ఫెల్లోస్ సంస్థను శంతను నాయుడు స్థాపించారు. కార్నెల్ వర్సిటీలో మేనేజ్మెంట్ విద్యను అభ్యసించిన శంతను నాయుడు టాటా గ్రూప్ ఎంప్లాయే. రతన్ టాటా ఆఫీస్లో 2018 నుంచి జనరల్ మేనేజర్ హోదాలో ఉన్నారు. ఆయన స్థాపించిన వాటిలో గుడ్ఫెల్లోస్ నాలుగో స్టార్ట్ అప్.
Ratan Tata invests | తోడు అవసరం
84 ఏళ్ల రతన్టాటా అవివాహితుడు. వృద్ధులకు తోడును కల్పించే సేవలకు సంబంధించిన ఈ Goodfellows స్టార్ట్ అప్ను ప్రశంసిస్తూ.. ``వృద్ధాప్యంలో తోడు లేకుండా ఒంటరిగా ఉండడం ఎంత కష్టమో మీకు తెలియదు. వృద్ధాప్యం వచ్చేవరకు వయస్సు పెరగడం గురించి పట్టించుకోం. ఈ వయస్సులో మంచి మనసున్న వారి సహకారం, తోడు లభించడం ఒక వరం`` అని వ్యాఖ్యానించారు.
Ratan Tata invests | స్టార్ట్ అప్స్ సపోర్టర్
రతన్టాటా పొటెన్షియల్ స్టార్ట్ అప్ కంపెనీలకు నిధుల పరంగా మద్దతు ఇవ్వడానికి ముందుంటారు. ముఖ్యంగా టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగిన తరువాత ఆయన స్టార్ట్ అప్లను సపోర్ట్ చేయడంపై దృష్టి పెట్టారు. నిత్యావసరాల నుంచి సాఫ్ట్వేర్ వరకు, డీటీహెచ్ నుంచి ఏర్లైన్స్ వరకు అన్ని రంగాల్లో టాటా గ్రూప్ కార్యకలాపాలను విస్తృతం చేయడంలో రతన్ టాటా చేసిన కృషి అనన్యసామాన్యం. టాటా గ్రూప్ లో క్రియాశీల బాధ్యతల నుంచి వైదొలగిన తరువాత దాదాపు 50 స్టార్ట్ అప్లకు నిధులను అందించడం ద్వారా ఆయన సహకారం అందించారు.
Ratan Tata invests | 15 మిలియన్
ప్రస్తుతం దేశంలో దాదాపు 1.5 కోట్ల మంది ఒంటరి వృద్ధులు ఉన్నారని Goodfellows స్టార్ట్ అప్ను ప్రారంభించిన శంతను నాయుడు తెలిపారు. రతన్ టాటా తనకు గురువు, స్నేహితుడు, శ్రేయోభిలాషి అని పేర్కొన్నారు. సహానుభూతి, ప్రేమ, దయ ఉన్న వారిని హైర్ చేసుకుని, అవసరమైన వృద్ధులకు సేవలు అందించడానికి రిక్రూట్ చేస్తామని నాయుడు వివరించారు. ఆ వృద్ధులకు అవసరమైన పనులు చేయడం, వారితో మాట్లాడుతూ సమయం గడపడం వంటివి చేస్తారన్నారు. తమ ఉద్యోగులు క్లయింట్స్(వృద్ధులు) వద్దకు వారానికి మూడు రోజులు వెళ్తారని, వెళ్లిన ప్రతీసారి కనీసం 4 గంటల సమయం వారితో గడుపుతారని వివరించారు. ఈ సేవలకు నెలవారీ సబ్స్కిప్షన్ రూ. 5 వేలతో ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఒక నెల ఫ్రీ సర్వీస్ కూడా ఉంటుందన్నారు. సైకాలజిస్ట్లు, ఎన్జీవోలతో చర్చలు జరిపిన అనంతరం ఈ సర్వీస్ మోడల్ను అభివృద్ధి చేశానన్నారు.