PM says 6G by this decade end: `5జీ` రాకముందే.. `6జీ` పై ప్రధాని ప్రకటన
27 August 2022, 19:00 IST
- ఫిఫ్త్ జనరేషన్(5జీ) వేలం ముగిసింది. ప్రధాన టెలీకాం సంస్థలైన ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాతో పాటు కొత్తగా ఆదానీ డేటా నెట్వర్క్స్ కూడా వేలంలో పాల్గొంది. కీలక సెక్టార్లలో జియో, ఎయిర్టెల్ పోటీపడి స్పెక్ట్రమ్ను దక్కించుకున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
PM says 6G by this decade end: త్వరలో దేశంలో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. అక్టోర్ 12 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. 5జీ సేవలను ప్రారంభించడానికి అన్ని మౌలిక వసతులతో సిద్ధంగా ఉన్నామని టెలీకాం సంస్థలు కూడా ప్రకటించాయి.
PM says 6G by this decade end: మోదీ ప్రకటన
5జీ సేవలు ప్రారంభం కాకమునుపే, 6జీ సేవలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక ప్రకటన చేశారు. ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశంలో 6జీ సేవలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు. `స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2022` కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. `స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2022` గ్రాండ్ ఫినాలేలో మోదీ పాల్గొన్నారు. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను 5జీ ద్వారా పొందవచ్చు. అంతకుమించిన వేగం, ఇతర సౌకర్యాలతో 6జీ సేవలు లభిస్తాయి. ముఖ్యంగా, గేమింగ్, ఎంటర్టెయిన్మెంట్, హెల్త్, డిఫెన్స్.. తదితర కీలక రంగాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ సేవల వల్ల లబ్ధి చేకూరుతుంది.
PM says 6G by this decade end: 5జీ ఎప్పుడు?
5జీ సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు జియో, ఎయిర్టెల్ ఇప్పటికే ప్రకటించాయి. 5జీ సేవలను అందించడం కోసం అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేశామని, పరిపాలనాపరమైన అనుమతులు రాగానే సేవలు అందిస్తామని వెల్లడించాయి. మరోవైపు, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అక్టోబర్ 12 నాటికి 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని టెలీకాం మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మరోవైపు, 5జీ సేవలను ఎంచుకున్న వినియోగదారులకు కొంత భారం పెరిగే అవకాశముంది. టెలీకాం సంస్థలు భారీ మొత్తాలు వెచ్చించి స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసిన నేపథ్యంలో.. ఆ మొత్తాన్ని లాభాలతో పాటు సంపాదించాలంటే ఆ భారాన్ని వినియోగదారులపైననే మోపుతాయి. అందువల్ల, టారిఫ్ ను పెంచే దిశగా కసరత్తు చేస్తున్నాయి టెలీకాం సంస్థలు.