Nitish hints about next Bihar polls: బిహార్ ఎన్నికలపై నితీశ్ సంచలన వ్యాఖ్యలు
13 December 2022, 23:14 IST
Nitish hints about next Bihar polls: బిహార్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బిహార్ సీఎం నితీశ్ కుమార్
Nitish hints about next Bihar polls: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో జరగనున్నాయి. జేడీయూ, ఆర్జేడీ పార్టీలు భాగస్వామ్యులుగా ఉన్న మహా ఘట్ బంధన్(మహా కూటమి) ఆ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొంటుందని ముఖ్యమంత్రి నితీశ్ వ్యాఖ్యానించారు.
Nitish hints about Tejaswi yadav: తేజస్వీ సారధ్యంలో..
2025 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న మహా కూటమి ఆర్జేడీ నాయకుడు, డెప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సారధ్యంలో పోరాడుతుందని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. అధికార పగ్గాలను తేజస్వీ యాదవ్ కు అప్పజెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ఈ మేరకు సంకేతాలిచ్చారు. తేజస్వీ వంటి యువ నాయకుల అవసరం ఉందని ఇప్పటికే నితీశ్ పలుమార్లు వ్యాఖ్యానించారు. తేజస్వీ యాదవ్ ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడన్న విషయం తెలిసిందే. మొదట్లో మంచి స్నేహితులైన లాలు ప్రసాద్ యాదవ్, జేడీయూ నేత నితీశ్ కుమార్ లు.. ఆ తరువాత రాజకీయంగా శత్రువులుగా మారిన విషయం తెలిసిందే. ఆ తరువాత తాజాగా నితీశ్ బీజేపీకి దూరమై, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో వారిద్దరి మధ్య మళ్లీ స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో తాజాగా నితీశ్ కుమార్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను తేజస్వీ నాయకత్వంలోనే పోరాడుతామని మంగళవారం కొందరు ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో నితీశ్ స్పష్టం చేశారు. తేజస్వీ వైపు చూపిస్తూ.. ‘తేజస్వీ జీ భవిష్యత్ నేత. ఆయన నాయకత్వంలోనే 2025లో అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతాం’ అన్నారు. ఈ విషయాన్ని ఆ సమావేశంలో పాల్గొన్న వామపక్ష ఎమ్మెల్యే మెహబూబ్ ఆలం నిర్ధారించారు.
Nitish hints about next Bihar polls: ప్రధాని పదవి కూడా వద్దు..
విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా నిలవాలన్న ఆకాంక్ష కూడా తనకు లేదని నితీశ్ కుమార్ గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. దేశానికి ప్రస్తుతం తేజస్వీ యాదవ్ వంటి యువ నేతల అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, శక్తిమంతమైన బీజేపీని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. విపక్షాలన్నీ ఏకమైతేనే.. బీజేపీని ఓడించి, కేంద్రంలో అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇందుకు తేజస్వీ వంటి యువనాయకులు ముందుకు రావాల్సి ఉందన్నారు.
2024 lok sabha polls : 2024 లోక్ సభ ఎన్నికలు
2024లో జరిగే లోక్ సభ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు చాలా కీలకమని నితీశ్ పేర్కొన్నారు. ఆ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని, అందుకు దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలన్నీ ఏకం కావాలని ఆయన సూచించారు. మతతత్వ శక్తులను ఓడించడానికి ప్రగతి శీల శక్తులన్నీ ఏకం కావాలన్నారు. అయితే, నితీశ్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తోసి పుచ్చుతున్నారు. నితీశ్ అధికారం, పదవి లేకుండా ఉండలేరని, మరోసారి అధికారంలోకి రావడం కోసం తేజస్వీని వాడుకుంటున్నాడని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నితిన్ నబీన్ విమర్శించారు. గతంలో జతిన్ రామ్ మాంఝీని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని వదిలేసినట్లే.. భవిష్యత్తులో తేజస్వీ యాదవ్ ను వదిలేస్తాడని నితిన్ జోస్యం చెప్పారు.
టాపిక్