Crime news: పబ్ లో గొడవ; ఆ తరువాత కారుతో ఢీ కొట్టి యువతి హత్య
26 December 2023, 21:13 IST
- Crime news: ఒక వ్యక్తి పబ్ లో ఒక జంటతో గొడవపడి, ఆ తరువాత, ఆ పబ్ వెలుపల వారిపై తన కారుతో ఢీ కొట్టిన ఘటన రాజస్తాన్ లోని జైపూర్ లో జరిగింది. ఈ ఘటనలో 19 ఏళ్ల యువతి మృతి చెందగా, ఆమె స్నేహితుడు (28) తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రతీకాత్మక చిత్రం
Crime news: ఒక వ్యక్తి పబ్ లో ఒక జంటతో గొడవపడి, ఆ తరువాత, ఆ పబ్ వెలుపల వారిపై తన కారుతో ఢీ కొట్టిన ఘటన రాజస్తాన్ లోని జైపూర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 19 ఏళ్ల యువతి మృతి చెందగా, ఆమె స్నేహితుడు (28) తీవ్రంగా గాయపడినట్లు జైపూర్ పోలీసులు తెలిపారు. నిందితుడు మంగేశ్ పరారీలో ఉన్నాడని తెలిపారు.
ఎస్ యూ వీ తో ఢీ కొట్టి..
జైపూర్ లోని జవహర్ సర్కిల్ ప్రాంతంలోని ఓ పబ్ లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాధితుడు రాజ్ కుమార్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ పబ్ మేనేజ్మెంట్ లో ఒకరైన బాధితుడు రాజ్ కుమార్ తన స్నేహితురాలు ఉమ (19) తో కలిసి సోమవారం రాత్రి సమయంలో ఆ పబ్ కు వెళ్లాడు. పైకప్పు నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం రాజ్ కుమార్, ఉమ రాత్రి 11 గంటల సమయంలో డిన్నర్ చేసేందుకు రెస్టారెంట్ కు వచ్చారు. నిందితుడు మంగేష్ తన ప్రియురాలితో కలిసి అక్కడే మద్యం సేవిస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఉమపై మంగేశ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు. రాజ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేయగా, ఉమ తనకు ముందే తెలుసని మంగేష్ చెప్పాడు. ఆ తరువాత వారి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలో మంగేష్ ఉమను తాకేందుకు ప్రయత్నించడం ఘర్షణ తీవ్రమైంది. కాసేపటికి రాజ్ కుమార్, ఉమ బయటకు వెళ్లి, క్యాబ్ కోసం ఎదురు చూడసాగారు. అదే సమయంలో బయటకు వచ్చిన మంగేశ్ కూడా తన ఎస్యూవీ కారును వేగంగా తీసుకువచ్చి, వారిద్దరిని ఢీ కొట్టి, పరారయ్యాుడు.
కేసు నమోదు..
ఈ ఘటనలో తీవ్రంగా ఉమ, రాజ్ కుమార్ లను అక్కడి వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఉమ మరణించినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రాజ్ కుమార్ కు చికిత్స అందించడం ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఆసుపత్రికి వెళ్లి, రాజ్ కుమార్ స్టేట్మెంట్ తీసుకున్నారు. మంగేశ్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లను సేకరించారు. పరారైన మంగేశ్ కోసం గాలింపు ప్రారంభించారు.