Bihar CM on hooch deaths: ‘తాగిన వాడు చస్తాడు’; కల్తీమద్యం మరణాలపై బిహార్ సీఎం
15 December 2022, 18:07 IST
Bihar CM on hooch deaths: బిహార్ లో కల్తీ మద్యం మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్ లో తాజాగా సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 40 మంది చనిపోయారు.
కల్తీ మద్యం తాగి మరణించినవారి కుటుంబ సభ్యలు రోదనలు
Bihar CM on hooch deaths: బిహార్ లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 40 మంది చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అంశాన్ని పార్లమెంట్ లోనూ బీజేపీ సభ్యులు లేవనెత్తారు. ఈ ఘటనపై బిహార్ అసెంబ్లీ రెండు రోజులుగా అట్టుడుకుతోంది.
Bihar CM on hooch deaths: తాగితే చస్తారు..
ఈ నేపథ్యంలో.. కల్తీ మద్యం మరణాలకు(hooch deaths)సంబంధించిన తనపై వస్తున్న విమర్శలకు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కల్తీ మద్యం తాగితే చస్తారు.. తప్పదు’ అంటూ ఆయన ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని పార్లమెంటులో బీజేపీ సభ్యులు లేవనెత్తడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షంగా అధికారంలో ఉన్న సమయంలో కూడా కల్తీ మద్యం మరణాలు(hooch deaths) సంభవించాయన్నారు. మద్య నిషేధ విధానం విఫలం అయిందన్న విమర్శలపై స్పందిస్తూ.. ‘రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలన్నది నా వ్యక్తిగత కోరిక కాదు. రాష్ట్రంలోని మహిళలు ముక్త కంఠంతో కోరితే మద్య నిషేధం విధించాం’ అన్నారు. కల్తీ మద్యం మరణాలకు(hooch deaths), మద్య నిషేధానికి సంబంధం లేదన్నారు. మద్య నిషేధం వల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరిందని, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని మండిపడ్డారు. మద్య నిషేధం అమల్లో లేని రాష్ట్రాల్లో కూడా కల్తీ మద్యం మరణాలు సంభవించాయన్నారు.
Opposition to Liquor prohibition: నిషేధం ఎత్తేయండి
కల్తీ మద్యంతో ఒకేసారి 40 మంది ప్రాణాలు కోల్పోవడంతో(hooch deaths) మద్య నిషేధ విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న సీపీఎం కూడా గురువారం అసెంబ్లీ ముందు ధర్నా నిర్వహించింది. ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ మద్యనిషేధాన్ని ఒక అర్థంలేని నిర్ణయంగా అభివర్ణించాడు. సీఎం నితీశ్, డెప్యూటీ సీఎం తేజస్వీ తమ ఈగోలను పక్కన బెట్టి మద్య నిషేధాన్ని ఎత్తివేయాలని సూచించారు. మద్య నిషేధాన్ని ఎత్తివేసి, మద్యం అమ్మకాలను నియంత్రించేలా చర్యలు తీసుకోవడం ఉత్తమమని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారు.
Bihar hooch deaths: భయంతో చికిత్సకు రావడం లేదు
కల్తీ మద్యం తాగి అస్వస్థతకు లోనైన వారు వెంటనే చికిత్స కోసం ఆసుపత్రులకు రావడం లేదని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. కల్తీ మద్యం తాగినందుకు వారిపై కేసులు పెట్టి జైళ్లో పెడతారన్న భయంతో వారు ఈ విషయాన్ని బయటపెట్టడం లేదన్నారు. మద్య నిషేధం కారణంగా బిహార్ నవ్వుల పాలయిందన్నారు. మద్య నిషేధ విధానాన్ని అమలు చేయడంలోనే తప్పుడు విధానాలను అవలంబించారని విమర్శించారు.
టాపిక్