Shyam Saran Negi : స్వతంత్ర భారత దేశ తొలి ఓటర్ ‘శ్యామ్’ కన్నుమూత
05 November 2022, 8:49 IST
- Shyam Saran Negi death : 106ఏళ్ల హిమాచల్ ప్రదేశ్వాసి శ్యామ్ శరణ్ నేగి శనివారం తుదిశ్వాస విడిచారు. స్వతంత్ర భారత దేశ తొలి ఓటర్గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
శ్యామ్ శరణ్ నేగి
Shyam Saran Negi death: స్వతంత్ర భారత దేశ తొలి ఓటర్గా గుర్తింపు తెచ్చుకున్న హిమాచల్ ప్రదేశ్ వాసి శ్యామ్ శరణ్ నేగి కన్నుమూశారు. 106ఏళ్ల నేగి.. అనారోగ్య కారణాలతో కిన్నౌర్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 2న.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు శ్యామ్ శరణ్ నేగి. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలిస్తోంది.
శ్యామ్ శరణ్ నేగి అంత్యక్రియల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అబిద్ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు.
తొలి ఓటర్..
Independent India's first voter : 1917 జులై 1న జన్మించిన నేగి.. కల్పాలో స్కూల్ టీచర్గా పనిచేశారు. 1947లో బ్రిటీష్ రాజ్యానికి ముగింపు పడిన కొన్నేళ్లకు దేశంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ విధంగా.. 1951 అక్టోబర్ 25న ఓటు వేసి, స్వతంత్ర భారత దేశ తొలి ఓటర్గా చరిత్రకెక్కారు శ్యామ్ శరణ్ నేగి.
వాస్తవానికి దేశంలో 1952 ఫిబ్రవరిలో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. కానీ హిమాచల్ ప్రదేశ్లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, కొన్ని నెలల ముందే.. అంటే అక్టోబర్లోనే పోలింగ్ నిర్వహించారు.
అప్పటి నుంచి ఒక్క ఎన్నికను కూడా మిస్ అవ్వకుండా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు నేగి. 2014లో ఆయన్ని ఎలక్షన్ ఐకాన్గా నిలబెట్టారు. ప్రజలందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రచారాలు చేసి పిలుపునిచ్చేవారు.
Shyam Saran Negi : "ఓటు వేయడం అనేది తమ బాధ్యత అని యువ ఓటర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇది దేశాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. దేశాన్ని సమర్థంగా నడిపించగలిగే నాయకుడిని ఎన్నుకునే శక్తి మన వద్ద ఉంది అంటే.. చాలా గర్వపడాల్సిన విషయం," అని ఓ సందర్భంలో నేగి అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు..
హిమాచల్ ప్రదేశ్లో ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ నెల 1 నుంచి 11 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 2వ తేదీన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు శ్యామ్ శరణ్ నేగి.
Himachal Pradesh assembly elections 2022 : నేగి ఇంటి కాంపౌండ్లో ఎన్నికల అధికారులు ఓ పోస్టల్ బూత్ను ఏర్పాటు చేశారు. రెడ్ కార్పెట్ వేసి.. నేగిని స్వాగతించారు. నేగి వేసిన ఓటును ఎన్వొలప్లో పెట్టి సీల్ చేశారు. బ్యాలెట్ బాక్స్లో వేశారు.
ఈ వార్త విన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. స్వతంత్ర భారత దేశ తొలి ఓటర్ శ్యామ్ శరణ్ నేగిపై ప్రశంసల వర్షం కురిపించారు.
'సనమ్ రే' అనే బాలీవుడ్ సినిమాలో స్పెషల్ అపియరెన్స్ కూడా ఇచ్చారు శ్యామ్ శరణ్ నేగి.