భార్యను చంపిన కేసులో భర్తకు జైలు శిక్ష- 7ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైన మహిళ!
13 December 2022, 10:34 IST
- UP crime news : చేయని తప్పుకు ఓ వ్యక్తి ఏడేళ్లుగా శిక్షను అనుభవిస్తున్న ఘటన వార్తలకెక్కింది. భార్యను చంపిన కేసులో ఆ వ్యక్తికి జైలు శిక్షపడింది. కాగా.. 7ఏళ్ల తర్వాత.. ఆ మహిళ వేరే ప్రాంతంలో ప్రత్యక్షమైంది!
భార్యను చంపిన కేసులో భర్తకు జైలు శిక్ష- 7ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైన మహిళ!
UP crime news : రాజస్థాన్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను చంపిన కేసులో ఓ వ్యక్తి ఉత్తర్ప్రదేశ్లో ఏడేళ్లుగా జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. కాగా.. చనిపోయింది అని అనుకున్న మహిళను.. రాజస్థాన్లో పోలీసులు గుర్తించారు. అసలేం జరిగిందంటే..
ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మహిళ..
సోను అనే వ్యక్తికి 2015లో ఆర్తి అనే మహిళతో పెళ్లి జరిగింది. కొన్ని రోజుల తర్వాత.. సోను పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీద రాయించుకునే ప్రయత్నం చేసింది ఆర్తి. డబ్బులు కూడా డిమాండ్ చేసింది. వీటికి సోను అంగీకరించలేదు. ఈ ఘటన జరిగిన 8 రోజుల తర్వాత.. ఆర్తి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆర్తిని చాలా చోట్ల వెతికాడు సోను. కానీ ఫలితం దక్కలేదు.
Rajasthan crime news : ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత.. మథురలోని మగోరా చెరువులో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించకుండానే.. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
తన బిడ్డ కనిపించడం లేదని.. ఆరు నెలల తర్వాత ఆర్తి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు కనిపించిన మహిళ మృతదేహానికి సంబంధించిన దస్తులు, ఫొటోలు ఆ వ్యక్తికి చూపించారు. ఆమె తన బిడ్డే అని తండ్రి సూరజ్ ప్రసాద్ గుప్తా పోలీసులకు చెప్పాడు. సోను సైనితో పాటు అతని బంధువు గోపాల్ సైని.. తన బిడ్డను చంపేశారని ఆరోపించాడు.
UP Man kills wife : రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని సోను, గోపాల్ను అరెస్ట్ చేశారు. ఏడేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని సోను చెప్పినా ఎవరూ వినలేదు. ఇంతలో.. ఆర్తి బ్రతికే ఉందన్న అనుమానం సోనులో పెరిగింది. తాను తప్పు చేయలేదని తనకు తెలుసు. ఈ క్రమంలోనే.. తన బంధువుల చేత ఆమెను వెతికి పట్టుకునే ప్రయత్నం చేశాడు. చివరికి.. ఆమె రాజస్థాన్లో ఉంటోందని తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని దౌసలోని మెహందీపూర్ బాలాజీ పోలీస్ స్టేషన్లోని అధికారులకు చెప్పాడు. చివరికి పోలీసులు ఆ మహిళను గుర్తించారు.
చేయని తప్పుకు ఏడేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న సోను, గోపాల్లు.. ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు. తమకు న్యాయం జరుగుతుందని వారిద్దరు ఆశాభావం వ్యక్తం చేశారు.