Anti conversion | మతం మారిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష
13 August 2022, 22:47 IST
బలవంతపు మూకుమ్మడి మత మార్పిడిలపై జైలు శిక్షను పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలా బలవంతంగా మూకుమ్మడి మత మార్పిడిలకు పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాన్నిసవరించింది.
హిమాచల్ ప్రదేశ్ కేబినెట్ భేటీ
Anti conversion | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ శనివారం The Himachal Pradesh Freedom of Religion (Amendment) Bill, 2022 ను ఏకగ్రీవంగా ఆమోదించింది. హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పటికే పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు బలవంతంపు మత మార్పిడులను నిషేధించే దిశగా చట్టాలను రూపొందించాయి.
Anti conversion | 2019 నాటి ..
2019నాటి చట్టంలో సవరణలు చేస్తూ ఈ బిల్లును రూపొందించారు. ఇందులో ప్రధానంగా బలవంతపు మత మార్పిడులకు శిక్షను గరిష్టంగా పదేళ్లకు పెంచుతూ సవరణ చేశారు. గతంలో ఇది ఏడేళ్లుగా ఉంది. బెదిరించి కానీ, ప్రలోభపెట్టి కానీ బలవంతంగా మత మార్పిడి చేయడం ఈ చట్టం ప్రకారం నేరం. అలా చేసినట్లు రుజువైతే, గరిష్టంగా పదేళ్ల వరకు జైలుశిక్ష విధించవచ్చు. మూకుమ్మడి మత మార్పిడులను ఈ చట్టం సంపూర్ణంగా నిషేధిస్తుంది. ఈ చట్టంలో మూకుమ్మడి మతమార్పిడి(Mass conversion) అంటే `ఒకేసారి ఒకరికి మించి` అని నిర్వచించారు.
Anti conversion | ఈ ఏడాది ఎన్నికలు
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం జైరామ్ ఠాకూర్ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ బిల్లుపై అసెంబ్లీలో మాట్లాడుతూ.. మూకుమ్మడి మత మార్పిడులపై ఉక్కుపాదం మోపే దిశగా ఈ సవరణను రూపొందించామని జైరాం ఠాకూర్ వెల్లడించారు. బలవంతపు మత మార్పిడులను బీజేపీ గట్టిగా వ్యతిరేకించే విషయం తెలిసిందే.