Turkey Earthquake: చనిపోయిన కూతురు చేయిపట్టుకొని.. హృదయాన్ని కలచి వేస్తున్న దృశ్యాలు: 15వేలు దాటిన మృతుల సంఖ్య
09 February 2023, 11:42 IST
- Turkey Earthquake: భూకంపాలతో అతలాకుతలమైన టర్కీలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎటుచూసినా నేలమట్టమైన భవనాలు కనిపిస్తున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు వినిపిస్తున్నాయి. కాగా, కొన్ని శాటిలైట్ చిత్రాలు భూకంప విధ్యంసాన్ని కళ్లకు కడుతున్నాయి.
Turkey Earthquake: హృదయాన్ని కలచివేస్తున్న భూకంప దృశ్యాలు (Photo: Twitter)
Turkey Earthquake: భూకంపాల విధ్వంసంతో టర్కీ, సిరియా (Syria Earthquake) లో అపార విధ్వంసం జరిగింది. వేలాది భవనాలు కుప్పకూలిపోయాయి. మృతుల సంఖ్య 15వేలు దాటింది. 7.8 తీవ్రతతో టర్కీ కేంద్రంగా సోమవారం సంభవించిన భూకంపం (Turkey Earthquake) వల్ల టర్కీ, సిరియాలోని చాలా పట్టణాలు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత మరిన్ని భూకంపాలు కుదిపేశాయి. మృతుల బంధువుల వేదన మిన్నంటుతోంది. ఎంతో మంది తమ వారి జాడ కోసం వేచిచూస్తున్నారు. ఈ భూకంప విధ్వంసాలకు సంబంధించిన ఫొటోలు కన్నీరు పెట్టిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందిన కూతురి చేతిని పట్టుకొని వేదనతో కూర్చుకొన్ని ఓ తండ్రి ఫొటో హృదయాలను కలచి వేస్తోంది. శిథిలాల కింది నుంచి ఆమెను బయటికి తీసేందుకు సహాయక సిబ్బంది కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన చాలా మంది చలించిపోతున్నారు. అలాగే భూకంపానికి ముందు, ఆ తర్వాత ఎంతటి విధ్వంసం జరిగిందో కూడా శాటిలైట్ ఫొటోలు బయటికి వచ్చాయి. పూర్తి వివరాలు ఇవే.
Turkey Earthquake: టర్కీలోని అంటక్యా, కహ్రామన్మరాస్ ఈ భూకంపాల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భూకంప కేంద్రం ఉన్న గజియాన్టెప్లో తీవ్ర ధ్వంసం జరిగింది. ఈ నగరాల్లోని వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయిలయ్యారు. చారిత్రక మసీదులు కూడా ధ్వంసం అయ్యాయి.
15వేల దాటిన మృతుల సంఖ్య
Turkey Earthquake: భూకంప విధ్వంసం వల్ల టర్కీ, సిరియా దేశాల్లో ఇప్పటి వరకు 15,383 మంది మృతి చెందారు. టర్కీలో 12,391 మంది, సిరియాలో 2,992 మంది ఇప్పటి వరకు చనిపోయారు. ఇంకా శిథిలాల కింద వేలాది మంది ఉన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే సిబ్బంది కొరతతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయని టర్కీ చెబుతోంది.
భారత్ సాయం
Turkey Earthquake: భూకంపాలతో కకావికలమైన టర్కీ, సిరియాకు భారత ప్రభుత్వం సాయం చేస్తోంది. సహాయక సిబ్బంది, వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు సహా చాలా రకాలు సాయం చేస్తోంది. ఆపరేషన్ దోస్త్ కింద ఆపన్నహస్తం అందిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే భారత్కు ధన్యవాదాలు చెప్పింది టర్కీ.
2కోట్ల మంది ప్రజలపై ప్రభావం
Turkey Earthquake: ఈ భూకంపం వల్ల టర్కీ, సిరియాలో మొత్తం 2.3 కోట్ల మంది ప్రభావితమయ్యారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) పేర్కొంది. మొత్తంగా ఇప్పటి వరకు 77 దేశాలు ఎమర్జెన్సీ మెడికల్ టీమ్లను టర్కీ, సిరియాకు పంపాయని వెల్లడించింది. 13 అంతర్జాతీయ సంస్థలు కూడా సాయం చేస్తున్నాయని పేర్కొంది.