సహజీవనం చేస్తున్న వ్యక్తి గొంతు కోసిన మహిళ.. ట్రాలీలో మృతదేహాన్ని కుక్కి..!
09 August 2022, 6:49 IST
woman kills live in partner : అతనితో ఓ మహిళ సహజీవనం చేస్తోంది. పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. మతం పేరు చెప్పి, అతను పెళ్లికి ఒప్పుకోలేదు. కోపంలో అతడిని ఆ మహిళ గొంతు కోసి చంపేసింది. ఉత్తర్ప్రదేశ్లో జరిగింది ఈ ఘటన.
సహజీవనం చేస్తున్న వ్యక్తి గొంతు కోసిన మహిళ..
woman kills live in partner : ఉత్తర్ప్రదేశ్ ఘాజియాబాద్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న వ్యక్తి గొంతును బ్లేడ్తో కోసేసింది ఓ మహిళ. అనంతరం ట్రాలీలో మృతదేహాన్ని కుక్కి.. వేరే ప్రాంతంలో విసిరిసేందుకు ప్రయత్నించింది. అప్పుడే పోలీసులకు దొరికిపోయింది.
పెళ్లికి ఒప్పుకోలేదని..
ప్రీతి శర్మ అనే మహిళ.. నాలుగేళ్ల క్రితం తన భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి ఫిరోజ్ అనే వ్యక్తితో సహజీవనంలో ఉంది. అతని వయస్సు 23ఏళ్లు.
కొంత కాలంగా.. తనని పెళ్లి చేసుకోవాలని ప్రీతి.. ఫిరోజ్ను అడుగుతోంది. ఏవేవో సాకులు చెబుతూ.. అతను తప్పించుకున్నాడు.
ఆదివారం రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. తనని పెళ్లి చేసుకోవాలని ప్రీతి.. మరోమారు ఫిరోజ్ను డిమాండ్ చేసింది. వేరే మతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబసభ్యులు ఒప్పుకోరని చెప్పాడు ఫిరోజ్. ప్రీతిని పెళ్లి చేసుకోలేనని తేల్చేశాడు.
ఈ క్రమంలో కోపం పెంచుకున్న ప్రీతి.. క్షణికావేశంలో ఫిరోజ్ను చంపేసింది. బ్లేడ్తో అతని గొంతు కోసేసింది. ఆ తర్వాత.. మృతదేహాన్ని ఓ పెద్ద ట్రాలీ బ్యాగులో కుక్కింది.
Ghaziabad crime news : ఘాజియాబాద్ రైల్వే స్టేషన్లో ట్రాలీని పడేసేందుకు బయలు దేరింది ప్రీతి. కానీ అప్పుడే రోడ్డు మీద ఓ పోలీసు వాహనం ఎదురైంది.
ట్రాలీని, ప్రీతిని మహిళా పోలీసు సిబ్బంది తనిఖీ చేశారు. అప్పుడే ట్రాలీలో నుంచి ఓ మృతదేహం బయటపడింది.
విచారణలో భాగంగా.. ప్రీతిని పోలీసులు ప్రశ్నించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. పెళ్లికి నిరాకరించడంతోనే సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపేసినట్టు ఆ మహిళ అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన బ్లేడ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.