Crime : డబ్బులు ఇవ్వలేదని వృద్ధురాలి గొంతు కోసేసిన 17ఏళ్ల మనవడు-delhi crime news 80 year old woman murdered by grandson ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime : డబ్బులు ఇవ్వలేదని వృద్ధురాలి గొంతు కోసేసిన 17ఏళ్ల మనవడు

Crime : డబ్బులు ఇవ్వలేదని వృద్ధురాలి గొంతు కోసేసిన 17ఏళ్ల మనవడు

Sharath Chitturi HT Telugu
Jul 09, 2022 08:47 AM IST

Delhi crime news : డబ్బులు ఇవ్వలేదని వృద్ధురాలిపై కోపం పెట్టుకున్నాడు 17ఏళ్ల మనవడు. సమయం చూసుకుని ఆమెను బ్లేడ్​తో గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది.

డబ్బులు ఇవ్వలేదని వృద్ధురాలి గొంతు కోసేసిన 17ఏళ్ల మనవడు
డబ్బులు ఇవ్వలేదని వృద్ధురాలి గొంతు కోసేసిన 17ఏళ్ల మనవడు (HT Telugu)

Delhi crime news : ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బులు అడిగితే ఇవ్వలేదని, బ్లేడుతో వృద్ధురాలి గొంతు కోసి చంపేశాడు ఓ 17ఏళ్ల బాలుడు. ఆ తర్వాత ఏం తెలియనట్టుగా స్కూల్​కు వెళ్లిపోయాడు.

డబ్బులు ఇవ్వలేదని..

షాలిమార్​ బాఘ్​లో ఓ 80ఏళ్ల వృద్ధురాలు నివాసముంటోంది. ఆమెకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. వారందరు తమ కుటుంబాలతో వేరుగా జీవిస్తున్నారు. ఆ వృద్ధురాలు అంటే ఇరుగుపొరుగు వారికి చాలా ఇష్టం. వారందరితో అమె ప్రేమగా మాట్లాడేది. కాగా.. శుక్రవారం ఉదయం వృద్ధురాలి ఇల్లు.. బయట నుంచి లాక్​ వేసి ఉండటాన్ని వారు చూశారు. కానీ లోపల ఏసీ పనిచేస్తుండటాన్ని గుర్తించారు. అనుమానం వచ్చి వృద్ధురాలి కుమార్తెకు ఫోన్​ చేశారు. కొద్దిసేపటికి తలుపు తెరిచి చూడగా.. వృద్ధురాలి మృతదేహం కనిపించింది. ఆమె గొంతు కోసేసి ఉంది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముందే.. ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు.

వృద్ధురాలి మెడలో ఆభరణాలు అలాగే ఉన్నాయి. తలుపులు కూడా విరగలేదు. ఘటన జరిగిన సమయంలో ఎలాంటి శబ్దాలు రాలేదు. అందువల్ల ఇది దొంగతనం కేసు కాదని నిర్ధరించారు. వృద్ధురాలికి తెలిసిన వారే ఈ హత్య చేసుంటారని అనుమాన వ్యక్తం చేశారు.

వారి అనుమానాలు నిజమయ్యాయి! బిల్డింగ్​ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు నిందితుడు దొరికిపోయాడు. వృద్ధురాలి హత్య జరిగిన రోజు రాత్రి 9గంటలకు.. ఓ యువకుడు బిల్డింగ్​లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో అతని ముఖానికి టవల్​ కప్పుకున్నాడు. రాత్రి 11గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడు ఎవరు? అన్న విషయం తెలుసుకునేందుకు పోలీసులకు ఎక్కువ సమయం పట్టలేదు. అతను.. ఆ వృద్ధురాలి మనవడు!

నిందితుడు.. ఓ పాఠశాలలో 12వ తరగతి చదువుకుంటున్నాడని తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లారు. వృద్ధురాలిని హత్య చేసిన 12 గంటలకు.. అసలు ఎలాంటి నేరం చేయలేదు అన్నంత ప్రశాంతంగా ఆ యువకుడు తరగతిలో పాఠాలు వింటూ కూర్చుండటాన్ని పోలీసులు గమనించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో భాగంగా.. అతను చేసిన తప్పును అంగీకరించాడు. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతోనే వృద్ధురాలని బ్లేడ్​తో గొంతు కోసి చంపినట్టు పోలీసులకు వివరించాడు. ఘటనపై దర్యాప్తు సాగుతోందని అధికారులు వివరించారు.

అయితే.. ఆ యువకుడు.. ఆ వృద్ధురాలికి సొంత మనవడు కాదని తెలుస్తోంది. వృద్ధురాలికి ఉన్న నలుగురు కుమారుల్లో.. చివరి వ్యక్తి.. ఐదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. ఆ మహిళకు అప్పటికే 12ఏళ్ల బిడ్డ ఉన్నాడు. ఇప్పుడే ఆ బిడ్డే.. ఐదేళ్ల తర్వాత, అంటే 17ఏళ్ల వ్యక్తి వృద్ధురాలని చంపేశాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం