Congress leader injured in accident: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేతకు గాయాలు; ఆయన భార్య మృతి
30 January 2024, 20:23 IST
Manvendra Singh injured: ఢిల్లీ - ముంబై ఎక్స్ ప్రెస్ వే పై మంగళవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మన్వేంద్ర సింగ్ గాయపడ్డారు. ఆయన భార్య చిత్రా సింగ్ మృతి చెందారు. మన్వేంద్ర సింగ్ బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి, దివంగత జశ్వంత్ సింగ్ కుమారుడు.
ప్రతీకాత్మక చిత్రం
రాజస్తాన్ లోని అల్వార్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత, లోక్ సభ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దివంగత జశ్వంత్ సింగ్ కుమారుడు మన్వేంద్ర సింగ్ గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య చిత్రా సింగ్ మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ముగ్గురికి గాయాలు..
ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేపై జరిగిన ఈ ప్రమాదంలో మన్వేంద్ర సింగ్ భార్య చిత్రా సింగ్ ప్రాణాలు కోల్పోగా, కుమారుడు హమీర్ గాయపడ్డాడు. వారి డ్రైవర్ కు కూడా గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మన్వేంద్ర సింగ్, ఆయన కుమారుడు హమీర్, డ్రైవర్ లను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తోంది. క్షతగాత్రులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు.
కారణాలు తెలియలేదు..
ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియనప్పటికీ, డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయి సైడ్ వాల్ ను ఢీకొట్టినట్లు కనిపిస్తోందని అల్వార్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తేజ్ పాల్ సింగ్ తెలిపారు. చిత్రా సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంతాపం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్వేంద్ర సింగ్, ఆయన కుమారుడు హమీర్, వారి డ్రైవర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 2018లో బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మన్వేంద్ర సింగ్ 1999 నుంచి 2004 వరకు రాజస్థాన్లోని బార్మర్ లోక్ సభ నియోజకవర్గానికి, బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహించారు.