India China relation : భారత్తో సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు
25 December 2022, 12:14 IST
India China border dispute : భారత్తో సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. అరుణాచల్ ప్రదేశ్లో సరిహద్దు ఘర్షణ తర్వాత చైనా నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
భారత్తో సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు
India China relation : భారత్తో సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుదేశాల మైత్రి వృద్ధి చెందే విధంగా.. భారత్తో నిలకడగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ ఈ మేరకు వ్యాఖ్యానించినట్టు ఆ దేశ విదేశాంగశాఖ వెబ్సైట్ పేర్కొంది.
భారత్తో సంబంధంపై ఇటీవలే మీడియాతో మాట్లాడారు వాంగ్ యీ.
India China border clash : "దౌత్య, మిలిటరీ పరంగా భారత్- చైనాలు సమాచార వ్యవస్థను కొనసాగిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఇరు దేశాలు కూడా కట్టుబడి ఉన్నాయి. భారత్- చైనా మధ్య స్థిరమైన, పటిష్ఠమైన సంబంధాల కోసం పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము," అని వాంగ్ యీ పేర్కొన్నారు.
ఈ నెల 9న.. భారత్- చైనా సైనికుల మధ్య అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ సరిహద్దుల్లో ఘర్షణ నెలకొందన్న వార్తల నేపథ్యంలో ఇరుదేశాల మైత్రిపై చైనా విదేశాంగమంత్రి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
India China Tawang clash : సరిహద్దు ఘర్షణ తర్వాత భారత్-చైనా దేశాలు ఈ నెల 20న ఓ సమావేశాన్ని నిర్వహించాయి. చుషుల్- మాల్డో సరిహద్దులో ఈ 17వ కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం జరిగింది. సరిహద్దులో భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించాలని ఇరు పక్షాలు ఓ అంగీకారానికి వచ్చాయని భారత్ విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
"వెస్టెర్న్ సెక్టార్లో భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. సన్నిహితంగా ఉంటూ.. దౌత్య, మిలిటరీ మార్గాల్లో చర్చలు నిర్వహిస్తూ, సరిహద్దు సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టాలని ఇరువైపుల అధికారులు నిర్ణయించారు," అని భారత దేశ విదేశాంగశాఖ పేర్కొంది.
భారత్- చైనా మధ్య అలజడులు..
"భారత్-చైనా సైనికుల మధ్య డిసెంబర్ 9న తవాంగ్ ఘర్షణ జరిగింది. ఈ ఘటనతో ఇరువైపులా పలువురు గాయపడ్డారు. భారత సైనికులెవ్వరికి తీవ్ర గాయాలు అవ్వలేదు. ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. భారత కమాండర్లు తక్షణమే స్పందించడంతో చైనా సైన్యం వెనుదిరిగింది. సరిహద్దు వద్ద ఘర్షణ నేపథ్యంలో దౌత్య మార్గంలో చైనాతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడింది. సరిహద్దు వెంబడి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మన సైన్యం సిద్ధంగా ఉంది," అని లోక్సభ వేదికగా కొన్ని రోజుల క్రితం రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
భారత్- చైనా మధ్య గత కొంతకాలంగా సత్సంబంధాలు లేవు. 2020 గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో సరిహద్దు వెంబడి ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. దాదాపు రెండేళ్లకు.. అనేక దశల చర్చల తర్వాత ఇప్పుడిప్పుడే సరిహద్దు వెంబడి శాంతి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇరువైపుల మధ్య ఘర్షణ తలెత్తడం సర్వత్రా ఆందోళనకు గురిచేసే విషయం.