Bihar: కల్తీ మద్యం తాగి ఏడుగురి మృతి.. ఘటనపై దద్దరిల్లిన అసెంబ్లీ.. సహనం కోల్పోయిన సీఎం నితీశ్: వీడియో
14 December 2022, 14:23 IST
- Bihar Spurious Liquor deaths: బిహార్లో కల్తీ మద్యం విషాదం మరోసారి జరిగింది. ఛప్రా పరిధిలో జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు.
బిహార్ అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీఎం నితీశ్ కుమార్
Bihar Spurious Liquor deaths: బిహార్లో విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి చెందారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. సరన్ జిల్లా ఛప్రా (Chhapra) పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. మొత్తం పదుల సంఖ్యలో ప్రజలు కల్తీ మద్యం సేవించగా.. అందులో ఐదుగురు గ్రామంలోనే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మిగిలిన వారికి చికిత్స జరుగుతోంది.
మృతదేహాలను పోస్టు మార్టం కోసం తరలించారు పోలీసులు. ఘటన గురించి విచారణ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
బిహార్లో మద్య నిషేధం అమలులో ఉంది. అయితే, కల్తీ మద్యం మాత్రం ఆ రాష్ట్రంలో విచ్చలవిడిగా లభిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య ఆ రాష్ట్రంలో నానాటికీ పెరుగుతోంది. కల్తీ మద్యం విషాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
అసెంబ్లీలో ప్రకంపనలు
కల్తీ మద్యం విషాద ఘటన బిహార్ అసెంబ్లీని కుదిపేసింది. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ముందుగా అసెంబ్లీ ఎదుట ఆందోళన చేశారు. ఆ తర్వాత సభలోనూ నిరసన చేపట్టారు. మద్య నిషేధం అంశంపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish Kumar) ను ప్రతిపక్ష నేత విజయ్ కుమార్ సిన్హా ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంలో సీఎం నితీశ్ సహనం కోల్పోయారు. ‘అరె మీరా మాకు చెప్పింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం తాగి వచ్చారా అంటూ ఆవేశంగా మాట్లాడారు.
మరోవైపు ఆర్జేడీకి చెందిన మాజీ మంత్రి సుధాకర్ సింగ్ కూడా మద్య నిషేధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. మద్యంపై నిషేధం విధించకుండా.. దాని వల్ల కలిగి హానీపై ప్రజల్లో అహగాహన కల్పించడం మంచిదని అన్నారు.
2016 ఏప్రిల్లో బిహార్ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని తీసుకొచ్చింది. ఆ రాష్ట్రంలో మద్యం తాగడం, అమ్మడంపై నిషేధం ఉంది.
టాపిక్