తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  President's Rule In Delhi : త్వరలోనే దిల్లీలో రాష్ట్రపతి పాలన..?

President's rule in Delhi : త్వరలోనే దిల్లీలో రాష్ట్రపతి పాలన..?

Sharath Chitturi HT Telugu

12 April 2024, 13:45 IST

google News
  • President's rule in Delhi : దిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్లాన్​ చేస్తోందా? ఈ విషయంపై ఆప్​ నేత సంచలన ఆరోపణలు చేశారు.

Delhi cabinet minister Atishi
Delhi cabinet minister Atishi (PTI)

Delhi cabinet minister Atishi

Arvind Kejriwal arrest latest news : లిక్కర్​ స్కామ్​లో అరవింద్​ కేజ్రీవాల్ అరెస్ట్​ నేపథ్యంలో.. ఆమ్​ ఆద్మీ పార్టీ నేత అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని దిల్లీ.. త్వరలోనే రాష్ట్రపతి పాలనలోకి జారుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని.. బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది చట్టవిరుద్ధమని, ప్రజాతీర్పునకు విరుద్ధమని ఆప్ నేత తెలిపారు.

అతిషి ఆరోపణలపై బీజేపీ వెంటనే స్పందించింది.

“అతిషి.. ఆమె ఒక బాధితురాలిగా ఎప్పుడు చెప్పుకుంటారు. లేదా ఆపరేషన్​ లోటస్​ అంటారు. ఇప్పుడు కొత్తగా.. దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ఆరోపణల్లో నిజం లేదు,” అని బీజేపీ దిల్లీ యూనిట్​ చీఫ్​ వీరేంద్ర తెలిపారు.

దిల్లీలో రాష్ట్రపతి పాలన..!

President rule in |Delhi : అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఆయన ప్రభుత్వాన్ని కూలదోయడానికి జరుగుతున్న రాజకీయ కుట్ర అని ఆప్ విమర్శించింది. “రానున్న రోజుల్లో దిల్లీలో రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2015, 2020లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీని ఓడించింది. అందుకే దిల్లీ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారు,” అని అన్నారు అతిషి.

దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలను సూచించే అనేక సంఘటనలు ఇటీవలి కాలంలో జరిగాయని అతిషి పేర్కొన్నారు.

“గత కొన్ని నెలలుగా దిల్లీలో సీనియర్ ఐఏఎస్ అధికారులెవరినీ నియమించలేదు. శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నా పోస్టింగులు లేవు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉటంకిస్తూ మంత్రులు పిలిచిన సమావేశాలకు అధికారులు హాజరుకావడం మానేశారు. దిల్లీ ప్రభుత్వ పనితీరుపై లెఫ్టినెంట్ గవర్నర్ ఎంహెచ్ఏకు లేఖలు రాస్తున్నారు,” అని తెలిపారు అతిషి.

ఆప్​ ఎందుకు భయపడుతోంది?

ఇదిలా ఉండగా.. అయితే రాష్ట్రపతి పాలన భయం ఆప్ ను వెంటాడడం ఆశ్చర్యం కలిగిస్తోందని వీరేంద్ర సచ్ దేవ్ అన్నారు.

“60 మందికి పైగా శాసనసభ్యులు, తగినంత మెజారిటీ ఉన్న పార్టీ, మరి ఎందుకు భయపడుతోంది? ఊహాజనితమైన, పనికిమాలిన కథలను నాటడంలో అతిషి నిపుణురాలు. 60 మందికి పైగా శాసనసభ్యులు తమను విడిచి వెళ్లిపోతారేమోనని వారు (ఆప్) భయపడుతున్నారు. దిల్లీలో రాష్ట్రపతి పాలన అనేది.. వారి భయమే తప్ప, అలాంటిది జరగదు,” అని వీరేంద్ర తెలిపారు.

అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసి, ప్రభుత్వాన్ని కొత్త ముఖ్యమంత్రికి అప్పగించి, దిల్లీ పరిపాలన సక్రమంగా సాగనివ్వడమే మంచిదని సచ్ దేవ్ అన్నారు.

2024 లోక్​సభ ఎన్నికలకు ముందు ఆప్, బీజేపీ మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరాయి. ముఖ్యంగా దిల్లీ లిక్కర్​ పాలసీ కేసులో మార్చ్​ 21న ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ కేజ్రీవాల్​ని అరెస్టు చేసినప్పటి నుంచి ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం