MLC Kavitha Arrest Case : లిక్కర్ కేసులో మరో పరిణామం... జైలులో ఉన్న కవితను అదుపులోకి తీసుకున్న సీబీఐ
Delhi Excise Policy Case Updates : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది.
కవితను అదుపులోకి తీసుకున్న సీబీఐ(CBI)… ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది. మనీ ల్యాండరింగ్ కేసులో(money laundering case) కస్టడీలోకి తీసుకొని విచారించనుంది. లిక్కర్ కేసుకు సంబంధించి విచారించనుంది.
ఇటీవలే కోర్టు అనుమతి….
ప్రస్తుతం తీహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న కవితను(Kavitha) విచారించేందుకు సీబీఐ.. ఇటీవలే ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయగా… దీనిపై విచారించిన న్యాయస్థానం కవితను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సీన్ లోకి సీబీఐ ఎంట్రీ అయింది. లిక్కర్ కేసులో కవితను విచారించి… స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు. లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన కవితను ఈడీ (ED)అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ లో పలు అంశాలను పేర్కొంది. కవిత(MLC Kavitha) చార్టర్డ్ అకౌంటెంట్, మరో నిందితుడు బుచ్చిబాబు గోరంట్ల మొబైల్ ఫోన్ నుంచి లభించిన వాట్సాప్ చాట్లు, విచారణలో లభించిన కొన్ని పత్రాలు, ఫోన్ల ఆధారంగా కవితను విచారించాల్సిన అవసరం ఉందని ప్రస్తావించింది.
నిజానికి ఈడీ అరెస్ట్ కంటే ముందు నుంచే… కవితకు పలుమార్లు సీబీఐ నోటీసులు ఇస్తూ వచ్చింది. అయితే సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో… కవిత విచారణకు హాజరుకాలేదు. పెండింగ్ లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ…సీబీఐకి సమాచారం ఇచ్చారు కవిత. కానీ విచారణకు మాత్రం హాజరు కాలేదు.
ఇక ఈ లిక్కర్ కేసులో ఇప్పటివరకు ఈడీ దాఖలు చేసిన ఆరు ఛార్జ్ షీట్లలో కవితపై అధికారికంగా అభియోగాలు మోపనప్పటికీ… కీలక వ్యక్తిగా ప్రస్తావిస్తూ వచ్చింది. మాస్టర్ కీ ఆమెనంటూ కోర్టుకు సమర్పించిన పలు పత్రాల్లో పేర్కొంది. "సౌత్ గ్రూప్" ను లీడ్ చేయటంలో ఆమె ప్రధాన సూత్రదారి అని తెలిపింది. ఇరువైపు వాదనలు వింటున్న కోర్టు… ఇటీవలే కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కూడా తిరస్కరించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor Case)రూపకల్పన, అమల్లో అవకతవకలు జరిగాయని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆప్ నేతలతో పాటు ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు సమన్లు ఇచ్చి విచారించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 15న హైదరాబాద్ లోని కవిత ఇంట్లో ఈడీ అధికారులు(ED Raids) సోదాలు నిర్వహించారు. అనంతరం కవితను అరెస్టు చేసి దిల్లీకి తరలించారు. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను అధికారులు విచారించారు. కవిత బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు… జ్యూడిషియన్ రిమాండ్ ను విధించింది. దీంతో ప్రస్తుతం ఆమె తీహర్ జైలులో ఉన్నారు. బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ కవితకు ఇప్పటివరకు ఊరట దక్కలేదు. ప్రస్తుతం సీన్ లోకి సీబీఐ ఎంట్రీ ఇవ్వటంతో… మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.