Musheer Khan: నిన్న టీమిండియాకు సెలెక్ట్ అయిన అన్న.. నేడు సెంచరీ కొట్టిన తమ్ముడు
30 January 2024, 17:43 IST
- Musheer Khan - Sarfaraz Khan: అండర్-19 ప్రపంచకప్లో భారత యంగ్ బ్యాటర్ ముషీర్ ఖాన్ సత్తాచాటుతున్నాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో సెంచరీతో కదం తొక్కాడు. ఈ ఏడాది టోర్నీలో రెండో శతకాన్ని నమోదు చేశాడు.
సర్ఫరాజ్ ఖాన్ - ముషీర్ ఖాన్
Musheer Khan - Sarfaraz Khan: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్లో భారత్ యంగ్ బ్యాటర్ ముషీర్ ఖాన్ దూకుడు కొనసాగిస్తున్నాడు. టోర్నీలో భాగంగా నేడు (జనవరి 30) న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లోనూ శతకంతో అదరగొట్టాడు. 126 బంతుల్లోనే 131 పరుగులు చేసి దుమ్మరేపాడు ముషీర్ ఖాన్. దేశవాళీ క్రికెట్లో సత్తాచాటుతున్న సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్ ఖాన్.
ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో మూడు మ్యాచ్ల్లోనే రెండో శతకంతో ముషీర్ సత్తాచాటాడు. దీంతో ఓ అండర్-19 ప్రపంచకప్ ఓ ఎడిషన్లో రెండు సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా (శిఖర్ ధావన్ తర్వాత) ముషీర్ ఖాన్ రికార్డులకెక్కాడు.
టీమిండియాకు అన్న.. సెంచరీతో తమ్ముడు
దేశవాళీ క్రికెట్లో సత్తాచాటుతున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాలో చోటు కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. అతడి ఆకాంక్ష నెరవేరింది. ఇంగ్లండ్తో రెండో టెస్టు కోసం భారత జట్టుకు సర్ఫరాజ్ ఎంపికయ్యాడు. తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. సర్ఫరాజ్ను నిన్న (జనవరి 29, సోమవారం) భారత జట్టుకు ఎంపిక చేశారు సెలెక్టర్లు.
సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాకు ఎంపికైన ఒక్కరోజులోనే.. అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ అండర్-19 ప్రపంచకప్లో మరో శతకంతో దుమ్మురేపాడు. దీంతో సర్ఫరాజ్ ఫ్యామిలీ మరింత ఆనందంలో మునిగితేలుతోంది. సర్ఫరాజ్ టీమిండియాకు ఎంపికరావడం పట్ల అతడి తండ్రి నౌషాద్ ఖాన్ ఇప్పటికే సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారుడిపై నమ్మకం ఉంచిన సెలెక్టర్లకు కృతజ్ఞతలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయంతో ఇంగ్లండ్తో రెండో టెస్టుకు టీమిండియా నుంచి ఔట్ అయ్యారు. దీంతో సర్ఫరాజ్కు చోటు దక్కింది.
అదరగొట్టిన భారత్
న్యూజిలాండ్తో నేడు జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ సూపర్ సిక్స్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 295 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ సెంచరీతో పాటు ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (52) అర్ధ శకతంతో రాణించాడు. టాస్ ఓడి తొలుత భారత్ బ్యాటింగ్కు దిగగా.. ఓపెనర్ అర్షిన్ ఖాన్ (9) త్వరగా ఔటయ్యాడు.
ఆ తర్వాత ముషీర్ ఖాన్, ఆదర్శ్ సింగ్ నిలకడగా ఆడారు. క్రమంగా దూకుడు పెంచారు. ముషీర్ బౌండరీలో చెలరేగాడు. మరోవైపు ఆదర్శ్ కూడా క్రమంగా పరుగులు రాబట్టాడు. 57 బంతుల్లో అర్ధ శతకం చేరుకున్న ఆదర్శ్.. వెంటనే ఔటయ్యాడు. ఆ తర్వాత కూడా ముషీర్ దూకుడు కొనసాగించాడు. కెప్టెన్ ఉదయ్ సహరన్ (34) అతడికి కాసేపు సహకరించాడు. 109 బంతుల్లోనే ముషీర్ సెంచరీకి చేరుకున్నాడు. ఆ తర్వాత గేర్ మార్చి హిట్టింగ్ చేశాడు. మరో ఎండ్లో వికెట్లు పడుతున్నా నిలిచాడు. అయితే, 48వ ఓవర్లో ముషీర్ ఔటయ్యాడు. కివీస్ బౌలర్లలో మేసన్ క్లార్క్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. ర్యాన్ సోర్గస్, ఎడ్వర్డ్ స్కూడర్, జాక్ కమింగ్, ఒలివర్ చెరో వికెట్ తీశారు. న్యూజిలాండ్కు 296 పరుగుల లక్ష్యాన్ని భారత అండర్-19 టీమ్ నిర్దేశించింది.