IND vs ENG 3rd Test: మూడో టెస్ట్లో అశ్విన్ రీప్లేస్ అతడే - సబ్స్టిట్యూట్ విషయంలో ఐసీసీ రూల్స్ ఎలా ఉన్నాయంటే?
17 February 2024, 9:59 IST
IND vs ENG 3rd Test: మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా మూడో టెస్ట్ నుంచి అశ్విన్ మధ్యలోనే వైదొలిగినట్లు బీసీసీఐ ప్రకటించింది. అశ్విన్ స్థానంలో దేవదత్ ఫడిక్కల్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్
IND vs ENG 3rd Test: మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా మూడో టెస్ట్ నుంచి మధ్యలోనే అశ్విన్ వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అఫీషియల్గా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. కఠిన పరిస్థితుల్లో అశ్విన్కు అండగా ఉంటామని వెల్లడించింది. అశ్విన్ తల్లి అనారోగ్యం పాలైనట్లు, అందుకే అతడు మూడో టెస్ట్కు దూరమైనట్లు తెలిసింది.
టీమిండియాకు ఎదురుదెబ్బ...
అశ్విన్ దూరమవ్వడంతో రాజ్కోట్ టెస్ట్లో టీమిండియాకు పెద్ద లోటుగా మారనుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో అశ్విన్ ఇంగ్లండ్ ఓపెనర్ క్రాలీని ఔట్ చేశాడు. మూడో రోజు బౌలింగ్ పరంగా అశ్విన్ టీమిండియాకు కీలకం కావాల్సింది. కానీ అనుహ్యంగా దూరం కావడం టీమిండియా ఎదురుదెబ్బగా మారింది.
రూల్స్ ఏం చెబుతున్నాయంటే....
అశ్విన్ దూరం కావడంతో మూడో టెస్ట్లో టీమిండియా పదిమందితోనే ఆడుతుందా...అతడి రీప్లేస్గా మరో క్రికెటర్ బరిలోకి దిగుతాడా అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ అశ్విన్కు సబిస్టిట్యూట్గా దేవదత్ ఫడిక్కల్ బరిలోకి దిగాడు. దేవదత్ ఫడిక్కల్కు ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే అనుమతి ఉంది. గాయం కారణంగా, అనారోగ్యంతో ఆట మధ్యలో నుంచి క్రికెటర్ వైదొలిగితే ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే సబ్స్టిట్యూట్ను అనుమతి ఇస్తారు.
అతడికి బౌలింగ్, బ్యాటింగ్ చేయడానికి, కెప్టెన్గా వ్యవహరించడానికి హక్కు ఉండదు. కొన్నిసార్లు అంపైర్స్ అనుమతితో మాత్రమే వికెట్ కీపింగ్ చేయవచ్చు. కానీ మూడో టెస్ట్లో అశ్విన్ గాయపడలేదు. అంతే కాకుండా అతడు అనారోగ్యంతో కాకుండా వ్యక్తిగత సమస్యల నుంచి వైదొలగడంతో ఇండియా తరఫున సబ్స్టిట్యూట్ను ఫీల్డింగ్కు అనుమతించాలంటే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అనుమతి ఇవ్వాలి.బెన్ స్టోక్స్ ఒప్పుకోవడంతోనే దేవదత్ ఫడిక్కల్ బరిలో దిగాడు.
కంకషన్ సబ్స్టిట్యూట్ అనుమతి ఎప్పుడంటే...
మ్యాచ్ జరుగుతోండగా ఆటగాడు తీవ్రంగా గాయపడిన సందర్భంలోనే కంకషన్ సబ్స్టిట్యూట్కు ఐసీసీ అనుమతి ఇస్తుంది. అప్పుడు మాత్రమే గాయపడిన ప్లేయర్ తరఫున వచ్చిన క్రికెటర్కు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ రాజ్కోట్ టెస్ట్లో అశ్విన్ గాయపడలేదు కాబట్టి కంకషన్ సబ్స్టిట్యూట్కు అనుమతి లేదు.
కుంబ్లే తర్వాత అశ్విన్…
రాజ్కోట్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్తో అశ్విన్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అనిల్ కుంబ్లే తర్వాత టీమిండియా తరఫున టెస్టుల్లో ఐదు వందల వికెట్లు తీసిన రెండో బౌలర్గా చరిత్రను సృష్టించాడు. ఈ లిస్ట్లో 619 వికెట్లతో కుంబ్లే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. మూడో స్థానంలో కపిల్ దేవ్ (434 వికెట్లు), నాలుగో ప్లేస్లో హర్భజన్ సింగ్ (417 వికెట్లు) ఉన్నారు. 280 వికెట్లతో రవీంద్ర జడేజా ఏడో స్థానంలో కొనసాగుతోన్నాడు.
పరుగుల వరద…
రాజ్కోట్ టెస్ట్లో పరుగుల వరద పారుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ, జడేజా సెంచరీలు సాధించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసింది. ఈ టెస్ట్లో రెండో రోజు ముగిసే సరికి ఇంగ్లండ్ రెండు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ డకెట్ 133 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. అతడితో పాటు రూట్ 9 పరుగులతో క్రీజులో కొనసాగుతోన్నాడు.