Nehra on Hardik Pandya: హార్దిక్ పాండ్యాను ఆపడానికి ప్రయత్నించలేదు.. కానీ ఇది చాలా డేంజర్: జీటీ కోచ్ నెహ్రా
16 March 2024, 20:00 IST
- Nehra on Hardik Pandya: గుజరాత్ టైటన్స్ (జీటీ) హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హార్దిక్ పాండ్యాను ముంబైకి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నించలేదని చెప్పాడు.
హార్దిక్ పాండ్యాను ఆపడానికి ప్రయత్నించలేదు.. కానీ ఇది చాలా డేంజర్: జీటీ కోచ్ నెహ్రా
Nehra on Hardik Pandya: ఐపీఎల్లో ఈ మధ్యకాలంలో సంచలనం రేపిన ప్లేయర్ ట్రాన్స్ఫర్ హార్దిక్ పాండ్యాదే. గతేడాది సడెన్ గా అతడు గుజరాత్ టైటన్స్ ను వదిలేసి తన పాత టీమ్ ముంబై ఇండియన్స్ కు వెళ్లిపోయాడు. కెప్టెన్ కూడా అయ్యాడు. దీనిపై గుజరాత్ టైటన్స్ (జీటీ) హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా తాజాగా స్పందించాడు. అదే సమయంలో ఇతర ఐపీఎల్ ఫ్రాంఛైజీలను కూడా హెచ్చరించాడు.
హార్దిక్ పాండ్యాను ఆపాలనుకోలేదు
ఐపీఎల్ 2024 మరో వారంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం (మార్చి 22) గుజరాత్ టైటన్స్ కోచ్ నెహ్రా ఈ అంశంపై మాట్లాడాడు. హార్దిక్ ముంబై ఇండియన్స్ కు కాకుండా మరో ఫ్రాంఛైజీకి వెళ్లాలనుకుంటే మాత్రం కచ్చితంగా తాను ఆపడానికి ప్రయత్నించేవాడినని ఈ సందర్భంగా నెహ్రా చెప్పడం గమనార్హం.
"ఇక్కడే ఉండాలని పాండ్యాకు ఎప్పుడూ నేను చెప్పడానికి ప్రయత్నించలేదు. ఎంత ఎక్కువగా ఆడితే అంత అనుభవం వస్తుంది. అతడు ఏదైనా ఇతర ఫ్రాంఛైజీకి వెళ్లాలనుకుంటే నేను కచ్చితంగా ఆపేవాడిని. అతడు ఇక్కడ రెండేళ్ల పాటు ఆడాడు. అంతకుముందే ఐదారేళ్లపాటు ఆడిన టీమ్ కు అతడు వెళ్లాడు" అని నెహ్రా అన్నాడు.
అయితే క్లబ్ ఫుట్బాల్ లో కనిపించే ఇలాంటి ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు ఐపీఎల్లోనే మెల్లగా ప్రారంభం అవుతున్నాయి. దీంతో ఈ విషయంపై నెహ్రా ఇతర ఫ్రాంఛైజీలను కూడా హెచ్చరించాడు. భవిష్యత్తులో పాండ్యాలాంటి ప్లేయర్స్ ట్రాన్స్ఫర్స్ మరిన్ని జరుగుతాయని అతడు స్పష్టం చేశాడు.
"క్రికెట్ ముందుకు వెళ్తున్న తీరు చూస్తుంటే.. అంతర్జాతీయ సాకర్ లో జరుగుతున్న ట్రేడ్స్, ట్రాన్స్ఫర్స్ మనం చూడబోతున్నాం. ఇది పాండ్యాకు ఓ కొత్త సవాలు. దీని ద్వారా అతడు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాం" అని నెహ్రా అన్నాడు.
గుజరాత్ టైటన్స్లో పాండ్యా రికార్డ్
ముంబై ఇండియన్స్ టీమ్ లో కీలక ప్లేయర్ గా ఎదిగినా 2022లో ఆ టీమ్ హార్దిక్ పాండ్యాను వదిలేసింది. దీంతో అదే ఏడాది ఐపీఎల్లోకి ఎంటరైన గుజరాత్ టైటన్స్ అతన్ని వేలంలో కొనుగోలు చేసి కెప్టెన్ ని చేసింది. పాండ్యా తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. 2022లో తొలి సీజన్లోనే జీటీని ఛాంపియన్ ను చేశాడు. ఇక గతేడాది కూడా ఫైనల్ వరకూ తీసుకొచ్చాడు.
అయితే చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడటంతో రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిజానికి హార్దిక్, నెహ్రా కాంబినేషన్ కూడా జీటీకి బాగా కలిసొచ్చింది. ఇప్పుడీ జోడీ విడిపోయింది. హార్దిక్ స్థానంలో ఈసారి శుభ్మన్ గిల్ జీటీకి కెప్టెన్ అయ్యాడు.
అయితే హార్దిక్ పాండ్యా సడెన్ గా తన పాత టీమ్ ముంబై ఇండియన్స్ కు వెళ్లడం, అతన్ని ఆపడానికి గుజరాత్ టైటన్స్ ప్రయత్నించకపోవడం, ఇప్పుడు ఎంఐలో రోహిత్ ను తప్పించి పాండ్యానే కెప్టెన్ ను చేయడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. మరీ ఈ కొత్త సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ ఎలా రాణిస్తాడో చూడాలి.
టాపిక్