Cricketer of the Year Gill: క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అతడే.. మాజీ కోచ్కు అరుదైన గౌరవం
23 January 2024, 7:33 IST
- Cricketer of the Year Gill: సుమారు ఐదేళ్ల తర్వాత జరగబోతున్న బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో శుభ్మన్ గిల్, రవిశాస్త్రిలకు అరుదైన గౌరవం దక్కబోతోంది. హైదరాబాద్ లో మంగళవారం (జనవరి 23) ఈ వేడుక జరగనుంది.
రవి శాస్త్రి, శుభ్మన్ గిల్
Cricketer of the Year Gill: టీమిండియా తరఫున గతేడాది అత్యున్నత ఫామ్ లో కనిపించిన ఓపెనర్ శుభ్మన్ గిల్ ను క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. మరోవైపు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వనుంది. ఈ అవార్డుల సెర్మనీ మంగళవారం (జనవరి 23) హైదరాబాద్ లో జరగనుంది.
ప్రస్తుతం ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు కోసం టీమిండియా హైదరాబాద్ లోనే ఉన్న విషయం తెలిసిందే. గురువారం (జనవరి 25) ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ అవార్డులను ఇవ్వబోతోంది. 2019 తర్వాత బోర్డు ఈ అవార్డులు ఇవ్వడం ఇదే తొలిసారి.
శుభ్మన్ గిల్.. టాప్ స్కోరర్
2023లో వన్డేల్లో శుభ్మన్ గిల్ టాప్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. అతడు వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. గతేడాది మొదట్లో డబుల్ సెంచరీ కూడా చేశాడు. అంతేకాదు వన్డేల్లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను వెనక్కి నెట్టి నంబర్ వన్ అయ్యాడు. సచిన్, కోహ్లి, ధోనీ తర్వాత ఈ ఘనత అందుకున్న నాలుగో ఇండియన్ బ్యాటర్ గా నిలిచాడు.
గతేడాది హైదరాబాద్ లోనే న్యూజిలాండ్ పై డబుల్ సెంచరీ చేయగా.. ఇప్పుడు మరోసారి అదే హైదరాబాద్ లో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకోబోతుండటం విశేషం. వన్డేల్లో ఇప్పటికే అతడు ఐదు సెంచరీలు చేశాడు. వరల్డ్ కప్ లోనూ రాణించాడు. దీంతో అతన్ని క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించాలని బోర్డు నిర్ణయించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో చెప్పారు.
రవిశాస్త్రికి లైఫ్టైమ్ అచీవ్మెంట్
టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రిని లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. ఇండియన్ టీమ్ తరఫున ఈ ఆల్ రౌండర్ 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. రెండుసార్లు టీమ్ కు కోచ్ గా పని చేశాడు. అతని కోచింగ్ లో 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ వరకూ టీమిండియా వెళ్లింది.
అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా టీమ్ గా కూడా ఇండియా నిలిచింది. వరుసగా రెండు పర్యటనల్లోనూ కంగారూ గడ్డపై టెస్టు సిరీస్ లు గెలవడం విశేషం. ఇక రవిశాస్త్రి కోచ్ గా ఉన్న సమయంలోనే తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇండియా తలపడింది.
టీమిండియా విషయానికి వస్తే ఇంగ్లండ్ తో గురువారం (జనవరి 25) నుంచి ఐదు టెస్టుల సిరీస్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్లు ఆన్లైన్లో దాదాపు అమ్ముడైపోయాయి. చాలా రోజుల తర్వాత ఇండియన్ టీమ్ ఇక్కడ ఆడుతుండటంతో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
టాపిక్