MP Nama Nageswara Rao : 17వ లోక్ సభకు ఎక్కువ రోజులు హాజరు - టాప్ ప్లేస్ లో ఎంపీ నామా
27 March 2024, 16:53 IST
- Khammam MP Nama Nageswara Rao News: ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకున్నారు. 17వ లోక్ సభకు తెలంగాణ నుంచి అత్యధికంగా హాజరైన వారిలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు టాప్ లో ఉన్నారు.
ఖమ్మం ఎంపీ నామా
BRS Khammam MP Nama Nageswara Rao: ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు(MP Nama Nageswara Rao) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. మన రాష్ట్రం తరపున లోక్ సభ సమావేశాలకు ఎక్కువ రోజులు హాజరైన ఎంపీగా నిలిచారు.17వ లోక్ సభకు తెలంగాణ నుంచి అత్యధికంగా హాజరైన వారిలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు టాప్ లో ఉన్నారు. 2019లో ఎన్నికలు జరిగిన నాటి నుంచి మొత్తం 273 రోజులు పార్లమెంటు సమావేశాలు జరిగాయి. ఎంపీ నామా 241 రోజుల పాటు సమావేశాలకు హాజరయ్యారు. అంటే ఈ హాజరు 88.3 శాతంగా నమోదైంది. లోక్ సభలో ఆయన వివిధ సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని 202 ప్రశ్నలు అడిగారు. నామా తర్వాత ఎక్కువ రోజులు హాజరైన వారిలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఉన్నారు. ఈయన 240 రోజులు హాజరై 78 ప్రశ్నలు మాత్రమే అడిగారు. తెలంగాణ నుంచి అత్యధికంగా ప్రశ్నలు అడిగిన బీఆర్ఎస్ లోక్ సభ సభ్యుల్లో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఉన్నారు. ఆయన 194 రోజుల్లో 345 ప్రశ్నలు అడిగారు.
ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీలో నామా….
ప్రస్తుతం ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు(BRS Khammam MP Nama Nageswara Rao) 17వ లోక్సభకు ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా మే నెలలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి ఖమ్మం స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మొదటి సారిగా లోక్సభకు 2004లో తెలుగుదేశం పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరిపై పోటీచేసి లక్ష ఓట్ల తేడాతో ఓడిపొయాడు. తిరిగి అదే అభ్యర్థి మీద 2009లో సుమారు 1,25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం నియోజకవర్గం నుంచి 11 వేల ఓట్ల తేడాతో వై.సి.పి. అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అనంతరం 2019 మార్చి 21వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో(TRS) చేరారు. నామా నాగేశ్వరరావు 2019లో టీఆర్ఎస్ పార్టీ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకుడిగా కూడా ఉన్నారు.